Petrol Price: పెంచినప్పుడు మాకు చెప్పి పెంచారా.. పెట్రోల్ ధరలపై కేంద్రానికి తమిళనాడు కౌంటర్

ABN , First Publish Date - 2022-05-22T21:25:06+05:30 IST

పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో ఇంధన ధరలు భారీగా తగ్గాయి. అయితే.. ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్న..

Petrol Price: పెంచినప్పుడు మాకు చెప్పి పెంచారా.. పెట్రోల్ ధరలపై కేంద్రానికి తమిళనాడు కౌంటర్

చెన్నై: పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో ఇంధన ధరలు భారీగా తగ్గాయి. అయితే.. ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్న సందర్భంగా కేంద్రం రాష్ట్రాలకు చేసిన సూచనపై తమిళనాడు అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘గత నవంబరులో కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించినా.. కొన్ని రాష్ట్రాలు స్థానిక పన్నులు తగ్గించలేదు. అలాంటి రాష్ట్రాలు ఈసారైనా స్పందించాలి’ అని కేంద్ర ఆర్థిక మంత్రి ఎక్సైజ్ సుంకం తగ్గింపు సందర్భంగా చెప్పారు. ఈ సూచనపై తమిళనాడు ఆర్థిక మంత్రి డాక్టర్. పి త్యాగరాజన్ ట్విట్టర్ వేదికగా కేంద్రానికి కౌంటర్ ఇచ్చారు. నిర్మలా సీతారామన్ ట్వీట్‌కు కౌంటర్ ఇస్తూ.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను సంప్రదించకుండా ఏకపక్షంగా పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర పన్నులను ఇష్టారీతిలో పెంచి ఇప్పుడు రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించుకోవాలని ఇప్పుడు చెబుతోందని కౌంటర్ ఇచ్చారు.



పెట్రోల్, డీజిల్ ధరలు పెంచినప్పడు కేంద్రం రాష్ట్రాలకు చెప్పి పెంచలేదని, మరి ఇప్పుడు ఎందుకు రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాలని గొంతుచించుకుంటోందని తమిళనాడు ఆర్థిక మంత్రి ప్రశ్నించారు. 2014 నుంచి లీటర్ పెట్రోల్‌పై 23 రూపాయలు, లీటర్ డీజిల్‌పై 29 రూపాయలు కేంద్ర పన్నులు విధించారని, ఏ ఒక్కసారి కూడా రాష్ట్రాలకు సమాచారం ఇవ్వలేదని ఆయన చెప్పారు. ఇప్పుడేమో.. పన్నుల ద్వారా 50 శాతం ఆదాయాన్ని పెంచుకుని.. రాష్ట్రాలు స్థానిక పన్నులు తగ్గించుకోవాలని కేంద్రం సూచిస్తోందని తమిళనాడు ఆర్థిక మంత్రి దుయ్యబట్టారు. అంతేకాదు.. పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం నవంబర్ 2021న పన్నులు తగ్గించిందని.. డీఎంకే ప్రభుత్వం 2021, ఆగస్ట్‌లోనే వ్యాట్‌ను తగ్గించిందని మంత్రి చెప్పారు.

Updated Date - 2022-05-22T21:25:06+05:30 IST