తమిళనాడు ఎన్నికలు... ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీలో ఆనందం...

ABN , First Publish Date - 2022-02-23T18:28:58+05:30 IST

తమిళనాడు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో వెల్లూరు నుంచి ట్రాన్స్‌జెండర్

తమిళనాడు ఎన్నికలు... ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీలో ఆనందం...

చెన్నై : తమిళనాడు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో వెల్లూరు నుంచి ట్రాన్స్‌జెండర్ గంగా నాయక్ విజయం సాధించడంతో ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ హర్షం వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఓ ట్రాన్స్‌జెండర్ విజయం సాధించడం ఇదే తొలిసారి. ఈ విజేత డీఎంకే అభ్యర్థిగా పోటీ చేశారు. ఇరవయ్యేళ్ళ నుంచి డీఎంకే మెంబర్‌గా ఉన్నారు. 


వెల్లూరు నగర పాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం జరిగింది. 37వ వార్డు నుంచి డీఎంకే అభ్యర్థి గంగా నాయక్ గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. గంగ సామాజిక కార్యకర్త, దక్షిణ భారత ట్రాన్స్‌జెండర్ అసోసియేషన్ కార్యదర్శిగా కూడా పని చేస్తున్నారు. వెల్లూరులో దినసరి కూలీ దంపతుల బిడ్డ గంగ. ఆమె సామాజిక సేవా కార్యక్రమాలతో గుర్తింపు పొందారు. ఆమె ఓ నాటక బృందాన్ని కూడా నడుపుతున్నారు. దీనిలో 50 మంది ఉన్నారు. వీరిలో 30 మంది ట్రాన్స్‌జెండర్లు. 


కోవిడ్ మహమ్మారి సమయంలో ఆమె తన నాటక బృందంతో కలిసి వెల్లూరు, రాణిపేట, కాంచీపురం, తిరువళ్లూరు, తిరువణ్ణామలై జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. 


తమిళనాడు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు 11 ఏళ్ళ తర్వాత జరిగాయి. 21 నగర పాలక సంస్థలు, 138 పురపాలక సంఘాలు, 490 నగర పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. 


ఏఐఎంఐఎంకు బోణీ

అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం తమిళనాడు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖాతా తెరిచింది. వనియంబాడి పురపాలక సంఘంలో రెండు స్థానాలను దక్కించుకుంది. ఈ పురపాలక సంఘంలో 36 వార్డులున్నాయి. 16 వార్డుల్లో ఈ పార్టీ అభ్యర్థులు పోటీ చేశారు. ఈ పార్టీ తరపున పోటీ చేసినవారిలో నియమతుల్లా, ఆర్ నబీలా గెలిచారు. 



Updated Date - 2022-02-23T18:28:58+05:30 IST