యూనివర్సిటీల పర్యటనలకు తమిళిసై

ABN , First Publish Date - 2022-08-07T09:25:40+05:30 IST

యువత కొత్త నైపుణ్యాలను అలవర్చుకుంటూ ఉద్యోగ సృష్టికర్తలుగా ఎదగాలని రాష్ట్ర గవర్నర్‌ తమిళి సై సౌందర్‌ రాజన్‌ అన్నారు.

యూనివర్సిటీల పర్యటనలకు తమిళిసై

ఉద్యోగ సృష్టికర్తలు కావాలి 


హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): యువత కొత్త నైపుణ్యాలను అలవర్చుకుంటూ ఉద్యోగ సృష్టికర్తలుగా ఎదగాలని రాష్ట్ర గవర్నర్‌ తమిళి సై సౌందర్‌ రాజన్‌ అన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో సవాళ్లు ఉంటాయని.. సవాళ్లు లేకపోతే జీవితం లేదని, వాటిని ఎదుర్కొన్నప్పుడే విజయాలు సొంతమవుతాయని చెప్పారు. డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ 24 స్నాతకోత్సవం శనివారం వర్సిటీలో ఘనంగా జరిగింది. స్నాతకోత్సవంలో భాగంగా కెనడా కామన్వెల్త్‌ ఆఫ్‌ లెర్నింగ్‌ ప్రెసిడెంట్‌ ప్రొఫెసర్‌ ఆశా ఎస్‌.కన్వర్‌కు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి వర్సిటీ చాన్స్‌లర్‌ హోదాలో హాజరైన గవర్నర్‌ మాట్లాడారు. ప్రధాని మోదీ చెప్పినట్లు చదువుకున్న యువత ఉద్యోగాల కోసం వెతుక్కోకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని అకాంక్షించారు. ప్రొ.అశా ఎస్‌.కన్వర్‌ మాట్లాడుతూ.. కొవిడ్‌ సమయంలో మానవళి చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో విద్యాభ్యాసానికి తీవ్ర అంతరాయం కలిగిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరొనా మహమ్మారి కంటే ముందు ఉన్న విద్యావ్యవస్థ, కరోనా తర్వాత విద్యావిధానంలో భారీ మార్పులు వచ్చాయని ప్రతి ఒక్కరు దూర విద్య గుర్తించి అలోచించే పరిస్థితులకు తీసుకువచ్చాయన్నారు.దేశంలోనే సార్వత్రిక విద్యలో అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ఆదర్శనీయమైనదని శ్లాఘించారు. ఈ కార్యక్రమంలో అంబేడ్కర్‌ వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొ. సీతారామారావు, రిజిస్ట్రార్‌ డా.ఏ.వి.ఎన్‌.రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, 


12 మంది ఖైదీలకు పట్టాలు 

స్నాతకోత్సవంలో మొత్తం 128 మంది బంగారు పతకాలు (డిగ్రీ-43, పీజీలో 85)  అందుకున్నారు. దేశంలోనే తొలిసారిగా రెగ్యులర్‌ వర్సిటీలతో సమానంగా ఓడీఎల్‌లో సీమీసీఎస్‌ విధానాన్ని ప్రవేశపెట్టగా కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు పట్టాలు అందుకున్నారు. వర్సిటీలో మొత్తం 282 మంది ఖైదీలు డిగ్రీ పూర్తిచేసుకున్నారు. వీరిలో చర్లపల్లి కేంద్రకారగారం నుంచి 12 మంది ఖైదీలు స్నాతకోత్సవంలో పట్టాలు అందుకున్నారు. ముగ్గురు ఖైదీలకు గోల్డ్‌ మెడల్స్‌తో పాటు (డిగ్రీ-1, పీజీ-2) బుక్‌ ప్రైజ్‌ లభించింది. 


రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన తమిళిసై

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మర్యాదపూర్వకంగా కలిసారు. శనివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో కలిసి ఆమెకు శభాకాంక్షలు తెలిపారు.

Updated Date - 2022-08-07T09:25:40+05:30 IST