యాపిలే నయం.. టమోట ప్రియం
ABN , First Publish Date - 2021-11-25T05:43:23+05:30 IST
టమోటా.. ఠారెత్తిస్తున్నది. కొనాలంటే కళ్లమ్మట నీరు తెప్పిస్తున్నది. ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న టమోటా సామాన్యులకే కాదు మధ్య తరగతి వర్గాలకు కూడా అందుబాటులో ఉండటంలేదు.
చుక్కలు చూపుతున్న టమోటా
రోజురోజుకు పెరిగిపోతున్న ధర
యాపిల్ కంటే టమోటా ధరే అధికం
దిగుమతులపై దృష్టిసారించని పాలకులు
గుంటూరు(తూర్పు), నవంబరు 24: టమోటా.. ఠారెత్తిస్తున్నది. కొనాలంటే కళ్లమ్మట నీరు తెప్పిస్తున్నది. ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న టమోటా సామాన్యులకే కాదు మధ్య తరగతి వర్గాలకు కూడా అందుబాటులో ఉండటంలేదు. గత కొన్ని రోజులుగా కూరగాయల ధరలు రెండు నుంచి మూడు రెట్లు పెరిగాయి. అన్ని కూరగాయలది ఒకెత్తుకాగా టమోటా మాత్రం వినియోగదారులకు చుక్కులు చూపిస్తుంది. రెండు మూడు రోజుల వరకు 60 నుంచి 70 వరకు ఉన్న ధర ఒక్కసారిగా సెంచరీని దాటేసింది. పెట్రోల్, డీజిల్ను కూడా దాటేసింది. నేడు యాపిల్, కమలా పండ్లును కూడా వెనక్కి నెట్టి దూసుకుపోతుంది. బుధవారం గుంటూరు కూరగాయల మార్కెట్లో కేజీ టమోటా ధర(మేలురకం) రూ.100- 120 మధ్య పలకింది. అదే పండ్ల మార్కెట్లో 25 కేజీల యాపిల్ బాక్స్ ధర రూ.2300 నుంచి 2600 వరకు ఉంది. అంటే కేజీ యాపిల్ రూ.92 నుంచి రూ.104 వరకు అందుబాటులో ఉండగా టమోటా మాత్రం సంచరీని దాటేసింది. ధరలపై నియంత్రణ, తనిఖీలు లేకపోవడంతో ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయని నిపుణులు చెబుతున్నారు. టమోటా లేకుండా ఏ కూర చేయడం అసాధ్యమని, తప్పనిసరి పరిస్థితుల్లో కొందామన్నా నాణ్యమైనవి అందుబాటులో లేవని వినియోగదారులు వాపోతున్నారు. గుంటూరు పట్టాభిపురం రైతుబజారులో టమోటా ధర రూ.64గా బోర్డులో పెట్టినా రూ.80కి విక్రయిస్తున్నారు. అవి కూడా నాణ్యంగా ఉండటంలేదని వినియోగదారులు వాపోతున్నారు.
చికెన్, గుడ్లు వైపు..
టమోటాతో పోల్చుకుంటే ప్రస్తుత పరిస్థితుల్లో చికెన్, గుడ్లు ధరలే అందుబాటులో ఉన్నాయని చెప్పుకోవాలి. బుధవారం కేజీ చికెన్ ధర రూ.160 వరకు ఉంటే, కోడిగుడ్లు హోల్సెల్ మార్కెట్లో 30 గుడ్లు ఉండే ట్రే రూ.160 వరకు ఉంది. మిగిలిన కూరగాయలు ధరలు కూడా ఆ కాశాన్ని అంటుతుండటంతో ఎక్కువమంది చికెన్, గుడ్లనే ఆశ్రయిస్తున్నారు.
చత్తీస్ఘడ్లో కేజీ రూ.50
జిల్లాలోని మార్కెట్లకు ఎక్కువగా చిత్తూరు జిల్లా మదనపల్లె నుంచి టమోటా దిగుమతి అవుతుంది. అయితే ప్రస్తుతం తుఫాన్, భారీ వర్షాల కారణంగా ఆయా ప్రాంతాల్లో పంట దెబ్బతిన్నది. దీంతో అక్కడి నుంచి దిగుమతులు లేవు. ఇక ఇతర ప్రాంతాల నుంచి తక్కువగా దిగుమతి అవుతున్నది. అది సరిపోక పోవడంతో కొరత ఏర్పడింది. కొత్త పంటకు మరికొంత సమయం ఉంది. దీంతో టమోటా అందుబాటులో లేక ధర విపరీతంగా పెరిగింది. అయితే చత్తీస్ఘడ్ రాష్ట్రంలో మేలురకం టమోటా కేజీ రూ.45 నుంచి 50 వరకు ఉంది. రవాణా, ఇతర ఖర్చులు అన్నీ పోగా వినియోగదారుడికి రూ.60లోపు అందించవచ్చు. కొంతమంది వ్యాపారులు ఇప్పటికే అక్కడ నుంచి తీసుకువచ్చి ఇక్కడి ధరకు అనుగుణంగా విక్రయిస్తున్నారు. అదే ప్రభుత్వమే నేరుగా చత్తీస్ఘడ్ నుంచి దిగుమతి చేసి, వినియోగదారులకు అందిస్తే ధర అందుబాటులోకి వస్తుంది. అయితే ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయడంలేదు. ధరలు విపరీతంగా పెరిగి వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టీపట్టనట్లుగా ఉంటున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి.
ధరల నియంత్రణపై దృష్టి ఎప్పుడో
నిత్యావసరాలు, కూరగాయలు ధరలు అధికంగా ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాల్లో వాటి ధరలు ఎంత ఉన్నాయి. తక్కువ ధర ఎక్కడ ఉంది అనే విషయాలపై అధికారులు సమావేశాలు నిర్వహించి అక్కడ నుంచి దిగుమతి చేసుకుంటారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం కింద జరిగే ఈ సమావేశాలు జేసీ అధ్యక్షతన నిర్వహిస్తారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉందని కారణం చూపుతూ ఆ సమావేశాన్ని వాయిదా వేశారు.