తానా వారి 'గ్రంథాలయం'-తెలుగు భాషా పరిరక్షణ నిలయం

ABN , First Publish Date - 2021-10-01T01:47:11+05:30 IST

చిరిగిన చొక్కా వేసుకున్నా ఫర్వాలేదు.. కానీ మంచి పుస్తకం చదువు.. అన్న ఒక మంచి మాట తెలియని తెలుగు ప్రజలుండరు.

తానా వారి 'గ్రంథాలయం'-తెలుగు భాషా పరిరక్షణ నిలయం

ఖండాంతరాలు దాటినా మాతృభాష మీద మమకారం 

తగ్గని ప్రవాసాంధ్రులు 

వాషింగ్టన్ డీసీ: చిరిగిన చొక్కా వేసుకున్నా ఫర్వాలేదు.. కానీ మంచి పుస్తకం చదువు.. అన్న ఒక మంచి మాట తెలియని తెలుగు ప్రజలుండరు. పుస్తకం ఇచ్చే విజ్జానం, పంచే సంస్కృతి, తెచ్చే చైతన్యం గురించి తెలిసే మహా మేధావులు ఆనాడు ఈ మంచినానుడి చాటి చెప్పారు. అయితే మాతృ భూమిని వీడి ఖండాంతరాలు దాటినా మాతృభాష మీద మమకారం ఎవరికీ తగ్గదు. దేశ విదేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులు కూడా మాతృభాష పరిరక్షణ, ప్రోత్సాహం కోసం సంకల్పించింది. పాఠకులలో విజ్జానం పెంచి, ప్రజలను చైతన్యవంతం చేసేది సాహిత్యం మాత్రమే. అందుకే తానా(తెలుగు అసొసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) కాపిటల్ రీజియన్ మరో ముందడుగు వేసింది. తెలుగు సాహిత్యాన్ని పెంపొందించడం కోసం తానా గ్రంథాలయం ఏర్పాటు చేసి దానిని తెలుగు భాషా పరిరక్షణా నిలయం తీర్చిదిద్దాలని భావిస్తోంది.


ప్రపంచ దేశాలన్నీ అత్యాధునిక సాంకేతిక పరిజ్జానంతో దూసుకుపోతున్నా, పాశ్చాత్య సంస్కృతి సంప్రదాయాలు మారుమూల పల్లెల్లోకి చొరబడుతున్నా సరే తెలుగు సాహిత్య, సంస్కృతి, సంప్రదాయాలకు దక్కుతున్న గౌరవం, అభిమానం అంతటా చెరగని ముద్ర వేసింది. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలపై విప్లవం తీసుకువచ్చేలా చేసిన ఘనత తెలుగు సాహత్యానిదే. పుస్తకాలూ కూడా మనిషి మానసిక ఆరోగ్యానికి ,వ్యక్తిత్వ వికాసానికి ,మనిషి లోని సృజనాత్మకతకు ఎంతో దోహద పడతాయి. మనిషి మనిషిగా నిలబడటానికి మానసిక ధైర్యాన్ని ఇస్తాయి. అందుకే అవి భాషా పరిరక్షక కేంద్రాలే కాక స్ఫూర్తిదాయక పాత్రని పోషిస్తాయి. 


మార్గదర్శకంగా తానా 'గ్రంథాలయం'

తెలుగు సాహిత్య విజ్జాన ఆలోచనలతో నాంది వాక్యం పలుకుతూ వాషింగ్టన్ డీసీ మెట్రో ఏరియాలో మొదటిగా తన గుర్తింపుని చాటుకుంటూ ఈ  సరిక్రొత్త ఆలోచనకు తెరతీసింది 'తానా కాపిటల్ రీజియన్'. తెలుగు భాషను పరిరక్షించాలన్న ఆకాంక్షతో ఈ తెలుగు గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టారు. తానా వారి ఆధ్వర్యంలో గాంధీ జయంతిని పురస్కరించుకొని శనివారం అక్టోబర్ 2 ,2021 నూతన తెలుగు గ్రంథాలయాన్ని ప్రారంభిస్తున్నారు. వెయ్యి తెలుగు పుస్తకాలతో గ్రంథాలయం కంప్యూటర్ కీ బోర్డుపై మీటలు నొక్కటం అలవాటైన చేతులతో మళ్లీ పుస్తకాలు పట్టించి, పుటలు తిప్పించి తెలుగు పుస్తకాల పూర్వవైభవానికి పునాది వేస్తున్నామని తానా సభ్యులు తెలిపారు. మొదటి విడతగా చిన్నారులకు, పెద్దలకు సంభందించిన వివిధ అంశాలతో కూడుకున్న వెయ్యి తెలుగు సాహిత్య  పుస్తకాలను పొందుపరుస్తున్నామని పేర్కొన్నారు.


కార్యక్రమావళి..

వారంలో ప్రతీ శని, ఆది వారాలలో చిన్నారులను ఆకర్షించే కథలు, పద్యాలు.. పెద్దలకు పుస్తక పఠన విశ్లేషణ కార్యక్రమాలు హృద్యంగా పొందుపరుస్తున్నట్లు చెప్పారు. అన్ని వయసుల వారికి, అన్నివేళల పుస్తకాలు చదువుకో గలిగే వెసలుబాటును కల్పిస్తున్నట్లు తెలిపారు. తెలుగు భాష మీద మక్కువ ఉన్న మనందరం కలసి తానా కాపిటల్ రీజియన్ వారి కృషిని అభినందిచటమేకాక తెలుగు పఠనానికి పూర్వవైభవాన్ని చాటిచెప్పే కృషిలో మీ వంతుగా ప్రోత్సాహాన్ని అందచేసి ఆదరించాలని కోరుకుంటున్నాము. ఈ ప్రారంభోత్సవ వేడుకలలో తెలుగు భాషా ప్రియులందరూ తమ పిల్లలతో పాల్గొని తెలుగు భాషను భావితరాలకు అందించే సువర్ణావకాశాన్ని అందిపుచ్చుకోవాలని తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి, తానా లీడర్ షిప్, తానా గ్రంథాలయ నిర్వాహకులు, తానా కాపిటల్ రీజినల్ కోఆర్డినేటర్ ఉయ్యురు శ్రీనివాస్ అన్నారు. 



Updated Date - 2021-10-01T01:47:11+05:30 IST