తానా ఆధ్వర్యంలో ఘనంగా 'తెలుగు భాషా దినోత్సవ' వేడుకలు

ABN , First Publish Date - 2021-08-31T14:21:33+05:30 IST

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహితీ విభాగం 'తానా ప్రపంచ సాహిత్య వేదిక' ఆధ్వర్యంలోవ్యావహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు వేంకట రామమూర్తి జయంతి (ఆగష్టు 29) సందర్భంగా 'తెలుగు భాషా దినోత్సవ' వేడుకలుఆగష్టు 28, 29 రెండు రోజులపాటు అంతర్జాతీయ స్థాయిలో వర్చువల్ విధానంలో ఘనంగా జరిగాయి.

తానా ఆధ్వర్యంలో ఘనంగా 'తెలుగు భాషా దినోత్సవ' వేడుకలు

తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో వినూత్నంగా ఘనంగా 'తెలుగు భాషా దినోత్సవ వేడుకలు'

అట్లాంటా, జార్జియా,ఆగస్ట్ 30: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహితీ విభాగం 'తానా ప్రపంచ సాహిత్య వేదిక' ఆధ్వర్యంలోవ్యావహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు వేంకట రామమూర్తి జయంతి (ఆగష్టు 29) సందర్భంగా 'తెలుగు భాషా దినోత్సవ' వేడుకలు ఆగష్టు 28, 29 రెండు రోజులపాటు అంతర్జాతీయ స్థాయిలో వర్చువల్ విధానంలో ఘనంగా జరిగాయి. ప్రతి నెలా ఆఖరి ఆదివారం జరుగుతున్న కార్యక్రమాలలో ఇది 16వ సమావేశం. తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు తన స్వాగతోపన్యాసంలో వ్యావహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు వేంకట రామమూర్తి గారి కృషిని, ఆయనకు ఆ ఉద్యమంలో సహకరించిన అనేక మంది సాహితీ వేత్తలకు ఘన నివాళులర్పించి సభను ప్రారంభించారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ ఒక మధురమైన తెలుగు పద్యం పాడి సభలో తెలుగుదనం నింపారు.  


ఈ సభలో ప్రముఖ నటులు, రచయిత తనికెళ్ళ భరణి విశిష్ట అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలుగు రాష్ట్రాలలో తెలుగు దీనావాస్థ స్థితిలో ఉందని ఆయన ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు విదేశాలలో ముఖ్యంగా తానా ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు వైభవంగా జరగడం చాల సంతోషించ దగ్గ విషయం అన్నారు. తనికెళ్ళ భరణి తెలుగులో రచించిన “ఎందరో మహానుభావులు” అనే గ్రంధాన్ని సత్య భావన అనే రచయిత్రి ఆంగ్లానువాదం చేసిన ప్రతిని మంత్రి డా. శశి పంజా ఆవిష్కరించారు. మన తెలుగు సంతతికి చెందిన వ్యక్తి ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా సేవలందిస్తున్న డా. బొప్పూడి నాగ రమేష్, ఐపీఎస్ ఈ సభలో ఒక విశిష్ట అతిథిగా పాల్గొని ఎంతోమంది సంగీత విద్వాంసుల జీవిత చరిత్రలను అత్యంత మనోహరంగా భరణి చిత్రీకరించారని, అందరూ చదవవలసిన పుస్తకం అని పుస్తక సమీక్ష చేశారు.


తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర అతిథులకు, వక్తలకు ఆహ్వానం పలికారు. శనివారం జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్ర మహిళా, శిశు అభివృద్ధి మరియు సాంఘిక సంక్షేమ శాఖామంత్రిగా ఉన్న తెలుగు సంతతికి చెందిన డా.శశి (పిల్లలమర్రి) పంజాను సభకు పరిచయం చేశారు. శశి నాన్న గారిది (పిల్లలమర్రి వేంకట కృష్ణయ్య) తెనాలి అని, అమ్మ గారిది (మాధవపెద్ది సీతాదేవి) గుంటూరు అని, ఆమె అన్నయ్య (మోహన్) పుట్టింది నరసరావు పేట అని గుర్తు చేశారు. కానీ, చిన్నపటి నుంచి కోల్‌కతాలో పెరగడం, చదవడం, ఉద్యోగంతో పాటు రాజకీయాలలో కూడా రాణించడం ముదావహం అన్నారు. వృతిరీత్యా వైద్యురాలిగా తీరికలేకుండా ఉంటూ కూడా రాష్ట్ర రాజకీయాలలో చాలా చురుకుగా పాల్గొనడం చాలా అభినందనీయం అని అన్నారు.  


డా. శశి పంజా మాట్లాడుతూ.. మాజీ కేంద్రమంతి అజిత్ కుమార్ పంజా కుమారుడు డా. ప్రసన్నకుమార్ పంజాతో వివాహం కావడం వల్ల తన పేరు శశి పంజాగా మారిందని తెలిపారు. ఎందరో మహానుభావులు పుట్టిన తెలుగు నేలపై పుట్టడం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. నాన్న ఉద్యోగరీత్యా కోల్‌కతాలో స్థిరపడడంతో చిన్నపటి నుంచి తెలుగు నేలకు దూరం అయ్యాం గాని తెలుగు భాషకు కాదని, ఇప్పటికీ మేము ఇంట్లో తెలుగే మాట్లాడతామన్నారు. మధురమైన మన తెలుగు భాషను మాట్లాడే వారు బెంగాల్ రాష్ట్రంలో చాలామంది ఉన్నారని, అందుకే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తెలుగును ఇటీవలే అధికార భాషగా గుర్తించారని తెలియజేశారు. తెలుగు వ్యవహారిక బాషగా ఉండాలనే ఉద్యమంలో గిడిగు వెంకట రామమూర్తి తన సర్వసాన్ని త్యాగం చేశారని గుర్తు చేస్తూ ఆయనకు నివాళులర్పించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తెలుగు భాషా దినోత్సవ వేడుకలని ఘనంగా నిర్వహిస్తున్న తానా ప్రపంచ సాహిత్య వేదికకు అభినందనలను తెలియజేశారు.


రెండో రోజు సభలో శ్రీకాకుళం జిల్లాలోని ఒక మారుమూల పల్లెనుంచి ఢిల్లీలో క్రీడా విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా ఎదిగిన సిడ్నీ ఒలింపిక్స్ పతక విజేత పద్మశ్రీ డా. కరణం మల్లేశ్వరి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. మల్లేశ్వరి మాట్లాడుతూ తెలుగు వ్యక్తిగా పుట్టడం తన అదృష్టం అని, మన భాషను రక్షించుకునేందుకు అందరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక కోసం తెలుగు వైభవం, సాహితీవేత్తలపై ప్రత్యేకంగా రూపొందించిన వీడియోను తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి విడుదల చేశారు.


తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. ఇకనుంచి ప్రతి నెలా సాహిత్య కార్యక్రమానికి ముందు ఈ వీడియోను ప్లే చేస్తామని, ఈ గీతాన్ని రాసిన తెలుగు వేదకవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, స్వరపరచిన సంగీత దర్శకులు నేమాని పార్థసారథి, గానం చేసిన అమర గాయకులు ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రెండు రోజులపాటు జరిగిన వేడుకల్లో గిడుగు వేంకట రామమూర్తి గారితో సహా మొత్తం 17 మంది లబ్ద ప్రతిష్టులైన విశిష్ట సాహితీవేత్తలను వారి కుటుంబ సభ్యులే పాల్గొని ఆ నాటి సామాజిక పరిస్ధితులు, వారి జీవన విధానం, సహా రచయితలతో వారి అనుబంధం, వారి సాహిత్య సృష్టి మొదలైన ఎన్నో పుస్తకాలలో లభ్యంకాని ఆసక్తికరమైన విషయాలను పంచుకోవడం సాహిత్య చరిత్రలోనే ఒక సరికొత్త కోణం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారందరికి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేశారు.   


పాల్గొన్న విశిష్ట సాహితీవేత్తల కుటుంబ సభ్యులు:    

డా. తుమ్మల సీతారామమూర్తి చౌదరి, తెనుగు లెంక, ఆధునిక పద్య కవి, పండితుడు కుమారుడు- తుమ్మల శ్రీనివాసమూర్తి

డా. రాయప్రోలు సుబ్బారావు, గొప్ప జాతీయవాది, ప్రముఖ కవి, రచయిత గారి మనుమరాలు ఆచార్య డా. మనోరమ (రాయప్రోలు) కానూరి

డా. కొండవీటి వేంకట కవి, సుప్రసిద్ధ కవి, హేతువాది, చలనచిత్ర సంభాషణల రచయిత కుమార్తె ఆచార్య డా. కొండవీటి విజయలక్ష్మి

డా.ముళ్ళపూడి వెంకటరమణప్రముఖ సాహితీవేత్త, ప్రముఖ చలనచిత్ర కథా, హాస్య సంభాషణల రచయిత కుమారుడు వర ముళ్ళపూడి

డా. గొల్లపూడి మారుతీరావు, రేడియో ప్రయోక్త, నటుడు, చలనచిత్ర కథా, మాటల రచయిత కుమారుడు గొల్లపూడి రామకృష్ణ

బ్రహ్మర్షి డా. ఉమర్ ఆలీషాసూఫీ వేదాంత వేత్త, తెలుగు సాహితీ వేత్త, సంఘ సంస్కర్త మునిమనవడు డా. ఉమర్ ఆలీ షా

పద్మభూషణ్ డా. గుర్రం జాషువాకవితా విశారద, కవి కోకిల, నవయుగ కవి చక్రవర్తి మునిమనవడు గుర్రం పవన్ కుమార్

పద్మభూషణ్ డా. దేవులపల్లి కృష్ణశాస్త్రిసుప్రసిద్ధ భావకవి, ప్రముఖ చలనచిత్ర గీత రచయిత మనవరాలు రేవతి అదితం

కళాప్రపూర్ణ గిడుగు వెంకట రామమూర్తి, వాడుక భాషోద్యమ పితామహుడు, బహు భాషాశాస్త్రవేత్త మునిమనవరాలు గిడుగు స్నేహలతా మురళి

పద్మభూషణ్ డా. బోయి భీమన్న, ప్రముఖ కవి, సామాజిక చైతన్య రచయితగారి సతీమణి హైమవతీ భీమన్న 

గురజాడ అప్పారావు, సంఘ సంస్కర్త, హేతువాది, అభ్యుదయ కవి మునిమనవరాలు అరుణ గురజాడ   

రాష్ట్రేందు డా. గుంటూరు శేషేంద్రశర్మ, ప్రముఖ కవి, విమర్శకుడు, పండితుడు, సాహితీవేత్త కుమారుడు గుంటూరు సాత్యకి

పద్మశ్రీ డా. పుట్టపర్తి నారాయణాచార్యులు, “సరస్వతీ పుత్ర”, సుప్రసిద్ధ కవి కుమార్తె డా. పుట్టపర్తి నాగపద్మిని 

పద్మభూషణ్ డా. విశ్వనాథ సత్యనారాయణ, కవి సమ్రాట్, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత మనవడు విశ్వనాథ సత్యనారాయణ

డా. రావూరి భరద్వాజ,జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, గొప్ప భావకుడు కుమారుడు రావూరి వెంకట కోటేశ్వర రావు, కోడలు లక్ష్మి 

కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి, ప్రముఖ సాహితీవేత్త, కవి కుమారుడు డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ

దేవరకొండ బాలగంగాధర తిలక్, అభ్యుదయ కవి, కథకుడు, నాటకకర్త కుమారుడు డా. దేవరకొండ సత్యనారాయణ మూర్తి 


ఈ రెండు రోజుల పూర్తి కార్యక్రమాలను ఈ క్రింది యూట్యూబ్ లింక్‌లలో చూడవచ్చు.

శనివారం, ఆగస్ట్ 28 యూట్యూబ్ లింక్: https://www.youtube.com/watch?v=WUFA6Qg2P-k

ఆదివారం, ఆగస్ట్ 29 యూట్యూబ్ లింక్: https://www.youtube.com/watch?v=8HArAMVQ1eQ


Updated Date - 2021-08-31T14:21:33+05:30 IST