తానా ‘తెలుగు భాషా దినోత్సవ వేడుకలు’

ABN , First Publish Date - 2021-08-26T09:37:53+05:30 IST

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా).. కీలక ప్రకటన చేసింది. వ్యావహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు వేంకట రామమూర్తి జయంతి (ఆగస్ట్ 29) సందర్భంగా తానా సాహిత్య వేదిక ఆధ్వ

తానా ‘తెలుగు భాషా దినోత్సవ వేడుకలు’

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా).. కీలక ప్రకటన చేసింది. వ్యావహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు వేంకట రామమూర్తి జయంతి (ఆగస్ట్ 29) సందర్భంగా తానా సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ‘తెలుగు భాషా దినోత్సవ వేడుకలు’ ఈ నెల 28,29 తేదీల్లో ఘనంగా నిర్వహించినున్నట్టు తాజా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు ప్రకటించారు. 

 

వర్చువల్ విధానంలో జరిగే ఈ వేడుకలకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మహిళా, శిశు అభివృద్ధి మరియు సాంఘిక సంక్షేమ శాఖామంత్రిగా ఉన్న డా శశి పిల్లలమర్రి (పంజా) ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్టు పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా పని చేస్తున్న డా బొప్పూడి నాగరమేశ్ ప్రత్యేక అతిథిగా పాల్గొననున్నట్టు తెలిపారు. ప్రముఖ నటులు,తనికెళ్ల భరణి విశిష్ట అతిథిగా శనివారం పాల్గొంటారని చెప్పారు. ఈ సందర్భంగా భరణి రచించిన “ఎందరో మహానుభావులు” అనే గ్రంథాన్ని డా. పంజా ఆవిష్కరించనున్నట్టు పేర్కొన్నారు. దివారం జరిగే కార్యక్రమానికి “ప్రసారభారతి” సీఈవో శశి శేఖర్ వెంపటి, దిల్లీ క్రీడా విశ్వవిద్యాలయం వీసీ కరణం మల్లీశ్వరి ముఖ్య అతిథులుగా పాల్గొంటారని చెప్పారు. 



తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. ఎంతోమంది లబ్ధప్రతిష్టులైన సాహితీవేత్తల జీవిత ప్రస్థానాలను ఈ సభలో వారి కుటుంబసభ్యులే ఆవిష్కరించడం సాహితీ చరిత్రలో ఒక అపూర్వ ఘట్టం అని అన్నారు. శనివారం నాడు డా. తుమ్మల సీతారామమూర్తి చౌదరి, డా. రాయప్రోలు సుబ్బారావు, డా. కొండవీటి వేంకట కవి, డా. ముళ్ళపూడి వెంకటరమణ, డా.గొల్లపూడి మారుతీరావు, బ్రహ్మర్షి డా. ఉమర్ ఆలీషా, పద్మభూషణ్ డా. గుర్రం జాషువా, పద్మభూషణ్ డా. దేవులపల్లి కృష్ణశాస్త్రి కుటుంబ సభ్యులు పాల్గొంటారని వెల్లడించారు. అదే విధంగా ఆదివారం రోజు కళాప్రపూర్ణ గిడుగు వెంకట రామమూర్తి, పద్మభూషణ్ డా. బోయి భీమన్న, గురజాడ అప్పారావు, రాష్ట్రేందు డా. గుంటూరు శేషేంద్రశర్మ, పద్మశ్రీ డా. పుట్టపర్తి నారాయణాచార్యులు, పద్మభూషణ్ డా. విశ్వనాథ సత్యనారాయణ, డా. రావూరి భరద్వాజ, కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి, దేవరకొండ బాలగంగాధర తిలక్ కుటుంబ సభ్యులు పాల్గొని ఎన్నో అసక్తికరమైన విషయాలను పంచుకోనున్నారని చెప్పారు. 


రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కోరారు. రెండు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమం భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 గంటలకు ప్రారంభం అవుతుందని ఈ క్రింది వివిధ మార్గాల ద్వారా కార్యక్రమాన్ని వీక్షించవచ్చని తానా ప్రపంచ సాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ తెలియజేశారు. మరిన్ని వివరాలు www.tana.orgలో తెలుసుకోవచ్చని చెప్పారు. 


1. TANA TV Channel – in YuppTV

https://www.facebook.com/tana.org

https://www.youtube.com/channel/UCwLhSy1ptf0i1CioyeZmzrw

www.youtube.com/tvasiatelugu

www.youtube.com/manatv


Updated Date - 2021-08-26T09:37:53+05:30 IST