TANAకు తాళ్లూరి జయశేఖర్ భారీ విరాళం

ABN , First Publish Date - 2021-07-14T22:52:13+05:30 IST

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మాజీ అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ ఆ సంస్థకు రెండు లక్షల డాలర్ల (సుమారు కోటిన్నర రూపాయలు) భారీ విరాళాన్ని ప్రకటించారు.

TANAకు తాళ్లూరి జయశేఖర్ భారీ విరాళం

వాషింగ్టన్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మాజీ అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ ఆ సంస్థకు రెండు లక్షల డాలర్ల (సుమారు కోటిన్నర రూపాయలు) భారీ విరాళాన్ని ప్రకటించారు. తానా ఆధ్వర్యంలో ప్రవాస చిన్నారులకు తెలుగు భాష నేర్పించే ‘పాఠశాల’ కార్యక్రమ నిర్వహణకు ఈ నగదు అందజేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రెండేళ్లపాటు తానా అధ్యక్షుడిగా కొనసాగిన తాళ్లూరి పదవీకాలం ఇటీవలే ముగిసింది. తాను ఇచ్చిన ఈ నిధులతో ఎన్నారై కుటుంబాలకు చెందిన తెలుగు విద్యార్థులకు మేలు జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తాళ్లూరి తానా సభ్యులకు సందేశాన్ని ఇచ్చారు.


2019-21 మధ్య తన హయాంలో నిర్వహించిన వేలాది కార్యక్రమాల నిర్వహణ తనకు సంతృప్తినిచ్చిందన్నారు. ప్రవాసుల యోగక్షేమాలను దృష్టిలో ఉంచుకుని ఈ దఫా తానా మహాసభలను నిర్వహించడం లేదని పేర్కొన్నారు. తద్వారా తానాకు నిధులు మిగులుతాయని, వీటితో పలు సేవా కార్యక్రమాల విస్తృతి పెంచేందుకు వీలు కలుగుతుందని జయశేఖర్ వెల్లడించారు. తానా భవిష్యత్తు కార్యక్రమాలకు తన సంపూర్ణ సహకారం ఉంటుందని తెలిపారు. తదుపరి అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి హయాంలో తానా మరింత బలోపేతం అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 


ఇంకా ఆయన మాట్లాడుతూ.. ఈ రెండేళ్ల పాటు విజయవంతంగా కార్యక్రమాలు నిర్వహించడానికి సహకరించిన తాన సభ్యులకు, బోర్డ్ సభ్యులకు, కార్యవర్గ సభ్యులకు, దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. నూతనంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న తానా అధ్యక్షలవారికి, బోర్డు సభ్యులకు, కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన, పెద్దదైన తెలుగు సంస్థ తానా అధ్యక్షుడిగా తనను ఎంపిక చేసి, సేవ చేసే అవకాశాన్ని కల్పించడం చాలా గొప్ప విషయం అని అన్నారు. ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకొని సమర్థంగా తన పాత్రను నిర్వహించానన్న సంతృప్తి తనకు ఉందన్నారు. తన పూర్తి శక్తిసామర్థ్యాలను, సమయాన్ని వెచ్చించి విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించి తానా ప్రతిష్టను ఇనుమడింప చేయగలిగానని తాను భావిస్తున్నట్లు చెప్పారు. తనతో పాటు మిగతా తానా సభ్యులందరూ కలిసి తానా పట్టల అందరిలో విశ్వసనీయత పెంచడానికి, తానా సేవలను విశ్వవ్యాప్తం చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేసి సఫళీకృతం అయ్యామని అందులో ఎటువంటి సందేహం లేదన్నారు. 


అమెరికాలో తెలుగు భాషా పునాదుల కోసం ఉద్దేశించిన 'పాఠశాల' వ్యవస్థను వ్యయ ప్రయాసలకు వోర్చి పునర్వ్యవస్థీకరణ చేశామన్నారు. 'అమెరికాలో బాలోత్సవం', 'పర్యావరణ దినోత్సవం', 'ప్రపంచ సాంస్కృతిక మహోత్సవం'(40 దేశాలలో ఉన్న వంద సంస్థలతో కలిసి) వంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామని తాళ్లూరి గుర్తు చేశారు. ప్రపంచంలో ఉన్న తెలుగు భాషాభిమానులను, తెలుగు కవులను, రచయితలు, అందరినీ ఒకే వేదకి మీదకు తీసుకువచ్చే ఉద్దేశంతో "తానా ప్రపంచ సాహిత్య వేదిక"ను నిర్మించి ప్రతినెలా నిర్వఘ్నంగా సాహిత్య కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. సాహితీ చరిత్రలో ప్రతిష్టాత్మకంగా "ప్రపంచ మహాకవి సమ్మేళనం-21"(23 దేశాల 21 సంస్థలతో కలిసి) నిర్వహించామని తెలిపారు. సాహిత్య రంగంలో, భాషా సేవా రంగంలో మునుపెన్నడూ లేని ఉత్సాహాన్ని నింపగలిగామన్నారు. 


మహమ్మారి కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో తానా ఫౌండేషన్ సమన్వయంతో లక్షలాది మందికి అన్నదానం, లక్షల మాస్కులు పంపిణీ చేశామన్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ సందర్భంగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు విరివిగా తెలుగు రాష్ట్రాలలో పంపిణీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రెండేళ్ల కాలంలో ఎంతోమంది గొప్ప వారితో కలిసి పనిచేసే అవకాశం తనకు కలిగిందన్నారు. వారి నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నట్లు తెలిపారు. తనపై చూపిన అభిమానం ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. పదవిలో ఉన్నా లేకపోయినా తానా సేవ కోసం తానేప్పుడూ ముందు ఉంటానని తాళ్లూరి చెప్పుకొచ్చారు. 

Updated Date - 2021-07-14T22:52:13+05:30 IST