డల్లాస్‌లో TANA ఆధ్యర్యంలో ఘనంగా 'పుస్తక మహోద్యమం'

ABN , First Publish Date - 2021-12-01T17:21:33+05:30 IST

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) తానా ప్రపంచ సాహిత్య సదస్సు ఆధ్వర్యంలో "పుస్తక మహోద్యమం" కార్యక్రమం ఘనంగా జరిగింది.

డల్లాస్‌లో TANA ఆధ్యర్యంలో ఘనంగా 'పుస్తక మహోద్యమం'

డల్లాస్, టెక్సాస్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) తానా ప్రపంచ సాహిత్య సదస్సు ఆధ్వర్యంలో "పుస్తక మహోద్యమం" కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రవాస భారతీయులు అధిక సంఖ్యలో ఎంతో ఆసక్తితో ఈ కార్యక్రమానికి వచ్చేశారు. చిన్నారులు రితిక, గాయత్రిలు మధురంగా ఆలపించిన ప్రార్ధనా గీతంతో సభను ప్రారంభించారు. ముందుగా తానా “తెలుగు భాషా పరివ్యాప్తి కమిటీ”  ఛైర్మన్ చినసత్యం వీర్నపు స్వాగతోపన్యాసంలో తల్లిదండ్రులు ఇంట్లో పిల్లలకు తెలుగు నేర్పించి, వీలైనంత వరకు వారితో తెలుగులో మాట్లాడాలని సూచించారు. పుస్తక మహోద్యమం గురించి మాట్లాడుతూ, గురువుల ద్వారా మనకు కొంత జ్ఞాన సంపాదన కలుగుతుందని, పుస్తక పఠనం ద్వారా దానిని ఇంకా రెట్టింపు చేసుకోవచ్చని తెలియజేశారు. పద్యాలు, అవధానాలు మన తెలుగు వారికే సొంతం అని, మరి ఏ భాషకి అటువంటి అదృష్టం లేదని గుర్తు చేశారు.


తానా ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన వివిధ శాఖలలో పనిచేస్తున్న తానా సభ్యులను సభకు పరిచయం చేసి, మంచి కార్యక్రమాలతో అన్నిసంస్థలతో కలసి పని చేసేందుకు తానా ఎల్లప్పుడూ కృషి చేస్తుందని చెప్పారు. తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ పుస్తకాలను కొని బహుమతులుగా ఇచ్చే సంప్రదాయాన్ని ప్రోత్సహించడం మంచి పరిణామం అన్నారు. ముఖ్యంగా పిల్లలకు చిన్నప్పటి నుండే పుస్తక పఠనంపై ఆసక్తి కల్గడానికి వారికి మంచి పుస్తకాలను పరిచయం చెయ్యాలని సూచించారు. ‘పాతికవేల పుస్తకాలు పాఠకుల చేతుల్లోకి’ అనే నినాదంతో ప్రారంభించిన ఈ అక్షర యజ్ఞానికి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. 


డా. ప్రసాద్ తోటకూర తానా కళాశాల చైర్మన్ రాజేష్ అడుసుమిల్లిని సభకు పరిచయం చేశారు. అనంతరం కళాశాల నిర్వహిస్తున్న కార్యక్రమాలను సభకు తెలియజేయవలసిందిగా కోరారు. ఈ సందర్భంగా రాజేష్ అడుసుమిల్లి మాట్లాడుతూ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తానా పూర్వాధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర చొరవతో తానా ప్రారంభించిన సంగీతం, నృత్య తరగతులకు విశేష స్పందన లభిస్తోందని గుర్తు చేశారు. ఇప్పటికే కొన్ని వందల మంది పిల్లలు విశ్వవిద్యాలయ స్థాయి తరగతుల్లో తమ పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు.  


తానా పాఠశాల చైర్మన్ నాగరాజు మాట్లాడుతూ, పాఠశాలలో పిల్లలకు సులభతరంలో తెలుగు నేర్చుకునే విధంగా పాఠ్యాంశాలను రూపొందించడం జరిగిందన్నారు. ఉపాధ్యాయులు కూడా పిల్లలకు అర్ధమయ్యే రీతిలో నేర్పిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే అమెరికా అంతటా, విదేశాలలో కూడా తానా పాఠశాలలో వేల సంఖ్యలో పిల్లలు చేరి తెలుగు నేర్చుకుంటున్నారని పేర్కొన్నారు. చిన్నారులు సాహితీ వేముల, సింధూర వేముల ఆలపించిన 'ఎంత చక్కని దోయి ఈ తెలుగు తోట' అనే గీతం అందరి మన్ననలు పొందింది. వారిని ప్రోత్సహిస్తున్నతలిదండ్రులు లెనిన్ వేముల, కిరణ్మయిలకు అభినందనలు తెలియజేశారు. లెనిన్ వేముల కొన్ని మధురమైన తెలుగు పద్యాలను ఆలపించి అందరిని ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది పిల్లలకు తానా బృంద సభ్యులు బాల సాహిత్యం పుస్తకాలను, పెద్దలకు ఉపయోగపడే అనేక పుస్తకాలను బహుమతులుగా అందించారు. 


ఎం.వి.ఎల్ ప్రసాద్, డా. సుధా కలవగుంట, డా. ఊరిమిండి నరసింహారెడ్డి, డా. గన్నవరపు నరసింహమూర్తి, డా. పూదూర్ జగదీశ్వరన్, టాంటెక్స్ అధ్యక్షులు లక్ష్మి పాలేటి, సుబ్రమణ్యం జొన్నలగడ్డ, స్వర్ణ అట్లూరి, డా. సత్యం ఉపద్రష్ట, లోకేష్ నాయుడు, పరమేష్ దేవినేని, సాంబయ్య దొడ్డ, శ్రీకాంత్ పోలవరపు, వెంకట ప్రమోద్, రాజేష్ అడుసుమిల్లి, మురళి వెన్నం, మధుమతి వైశ్యరాజు, కళ్యాణి తాడిమేటి, వీర లెనిన్, సురేష్ కాజ, లెనిన్ వేముల, సురేష్ మండువ, బసవి ఆయులూరి, వెంకట్ తాడిబోయిన మొదలైన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అడయార్ ఆనంద్ భవన్ అధినేత రమేష్ గాదిరాజు, వివిధ ప్రసార మాధ్యమాలకు, వివిధ కమిటీ సభ్యులకు, స్వచ్ఛంద కార్యకర్తలకు సతీష్ కొమ్మన ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతఙ్ఞతలు తెలియజేశారు.













Updated Date - 2021-12-01T17:21:33+05:30 IST