తెలుగు రాష్ట్రాలకు TANA రూ.25 కోట్ల భారీ వైద్య విరాళం

ABN , First Publish Date - 2021-11-06T18:28:09+05:30 IST

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా) ఆధ్వర్యంలో త్వరలో రెండు తెలుగు రాష్ట్రాలకు 3.2 మిలియన్(సుమారు రూ.25 కోట్లు) డాలర్ల భారీ విరాళం అందనుంది.

తెలుగు రాష్ట్రాలకు TANA రూ.25 కోట్ల భారీ వైద్య విరాళం

వివరాలు వెల్లడించిన తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు   

ఎన్నారై డెస్క్: తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా) ఆధ్వర్యంలో త్వరలో రెండు తెలుగు రాష్ట్రాలకు 3.2 మిలియన్(సుమారు రూ.25 కోట్లు) డాలర్ల భారీ విరాళం అందనుంది. అమెరికాలోని "నార్త్ వెస్ట్రన్ మెమోరియల్ హెల్త్ కేర్", చికాగో సంస్థ కోవిడ్ సంబంధ వైద్య పరికరాల రూపంలో ఈ భారీ విరాళం ప్రకటించింది. ఈ వైద్య పరికరాలు ప్రస్తుతం అమెరికా నుంచి సముద్ర మార్గం ద్వారా బయలుదేరాయి. నవంబర్ నెలలో భారత్ చేరనున్నాయి. వీటిని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ఆసుపత్రులకు ఉచితంగా అందజేయడానికి తానా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ భారీ విరాళం సాధనలో తానా పూర్వ అధ్యక్షురాలు పద్మశ్రీ ముత్యాల, అనిత ముఖ్యమైన భూమిక పోషించారు. తానా సంస్థకు 20 సంవత్సరాల క్రితమే ముత్యాల అత్యంత పిన్నవయసులో అధ్యక్షురాలిగా పనిచేశారు. తానా చరిత్రలో ఆమే ఏకైక మహిళాధ్యక్షురాలు కావడం విశేషం. తానా మీద మమకారంతో తెలుగువారికి సేవ చేయ్యాలనే దృక్పథంతో ఈ మహోత్తరమైన కార్యక్రమాన్ని మొదట నుండి అతి దగ్గరగా పర్యవేక్షించారు.


తానా ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ వెంకట రమణ ఆధ్వర్యంలో సమన్వయకర్తలు అశోక్ బాబు కొల్లా, రమాకాంత్ కోయ, సలహాదారురాలు పద్మశ్రీ ముత్యాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగనున్నది. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి తానా పూర్వ అధ్యక్షులు జై తాళ్లూరి, తానా పూర్వపు ఫౌండేషన్ చైర్మన్ నిరంజన్ శృంగవరపు, తానా కార్యవర్గం తమ వంతు సహాయ సహకారాలు అందించారు. ఈ వైద్య పరికరాలు తెలుగు రాష్ట్రాలు చేరగానే తానా, రెడ్ క్రాస్ సంస్థ వారి సహకారంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో వైద్య సహకారం సరిగ్గా అందక, అనేక ఇబ్బందులు పడిన తెలుగువారికి తానా ద్వారా ఇంత పెద్ద మొత్తంలో సహాయాన్ని అందిస్తున్నందుకు నార్త్ వెస్ట్రన్ హాస్పిటల్, చికాగో వారికి తానా, రెండు రాష్ట్రాల ప్రజల తరుపున అంజయ్య చౌదరి లావు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

Updated Date - 2021-11-06T18:28:09+05:30 IST