తిరుపతిలో టాటా క్యాన్సర్‌ ఆస్పత్రి

ABN , First Publish Date - 2022-05-21T08:04:54+05:30 IST

తిరుపతిలో టాటా క్యాన్సర్‌ ఆస్పత్రి వైద్యసేవలు మొదలయ్యాయి.

తిరుపతిలో టాటా క్యాన్సర్‌ ఆస్పత్రి
టాటా క్యాన్సర్‌ ఆస్పత్రి

వైద్యసేవలు  ప్రారంభించారు


తిరుపతిలో టాటా క్యాన్సర్‌ ఆస్పత్రి వైద్యసేవలు మొదలయ్యాయి. క్యాన్సర్‌ వైద్యసేవలందించడంలో దేశంలోనే పేరు ప్రతిష్ఠలు గల సంస్థ తిరుపతి జూపార్క్‌ రోడ్డులో రూ.200 కోట్ల వ్యయంతో  శ్రీవేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్యాన్సర్‌ కేర్‌ అండ్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (స్వీకార్‌)ను ఏర్పాటు చేసింది. అత్యాధునిక వైద్య సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. సీఎంగా ఉన్నపుడు చంద్రబాబు నాయుడు భూమిపూజ చేసిన ఈ ఆస్పత్రిని ఇటీవలే సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రారంభించారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రజలకు ఈ ఆస్పత్రి పెద్ద వరం అవుతుంది. ఆపరేషన్‌ థియేటర్లు ఇంకా పూర్తిస్థాయిలో ఏర్పడలేదు. 


తిరుపతి, ఆంధ్రజ్యోతి: అలిపిరి నుంచి జూపార్క్‌కి వెళ్లే దారిలో 25 ఎకరాల విశాలమైన ప్రాంగణంలో టాటా క్యాన్సర్‌ ఆస్పత్రి భవనాలు నిర్మించారు. ప్రస్తుతం ఓపీ సేవలు మాత్రమే ఇక్కడ లభిస్తున్నాయి. అతి త్వరలోనే మిగతా సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఆపరేషన్‌ థియేటర్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఐసీయూ, అత్యవసర విభాగ సేవలు మొదలు కానున్నాయి. డాక్టర్లు, నర్సులు కలిపి 70 మంది ప్రస్తుతం విధుల్లో ఉన్నారు.  ఉదయం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఆస్పత్రిలో వైద్య సేవలు లభిస్తున్నాయి. 


రూ.30కే ఓపీ 

ప్రతిష్ఠాత్మక టాటా క్యాన్సర్‌ ఆస్పత్రిలో ఓపీ ఫీజు రూ.30 మాత్రమే. వైద్యసేవల కోసం తొలిసారి ఆస్పత్రికి వచ్చేవారు రూ.50 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్‌ ఫీజు ఒక్కసారి మాత్రమే వసూలు చేస్తారు.  టోల్‌ ఫ్రీ నెంబరు: 18001036123 కి ఫోన్‌ చేసి ముందుగానే ఓపీ బుక్‌ చేసుకోవచ్చు. 


ఏయే విభాగాలున్నాయి?

ప్రస్తుతం మెడికల్‌, రేడియేషన్‌ ఆంకాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. సర్జికల్‌ ఆంకాలజీ ఓపీ మాత్రం చూస్తున్నారు. ఆపరేషన్‌ థియేటర్లు పూర్తయ్యాక ఆపరేషన్లు చేపడతారు.  


అధునాతన వైద్య పరికరాలు

ఆసియాలోనే అధునాతన లీనియర్‌ యాక్సిలరేటర్‌ టాటా ఆస్పత్రిలో ఉంది. దాదాపు రూ.20 కోట్లు విలువ చేసే ఈ పరికరంతో రేడియో థెరపీ అందిస్తున్నారు. 2ఎంఎం ఉండే చిన్న చిన్న బ్రెయిన్‌ ట్యూమర్స్‌ కూడా ఈ పరికరం ద్వారా కరిగించే వీలుంది. ఎంఆర్‌ఐ పరికరం ఉండే గదిని కూడా ప్రత్యేకంగా డిజైన్‌ చేశారు. సొరంగంలోకి వెళ్తున్న ఫీలింగ్‌  (క్లాస్టోఫోబియా) కలగకుండా పైన ఆహ్లాదకరమైన స్ర్కీన్‌ ఉంటుంది. ఏదో ఇరుకు పరికరంలోకి వెళ్తున్నట్టు కాకుండా  విశాలంగా ఉంటుంది.  


దరఖాస్తు దశలో ఆరోగ్యశ్రీ 

టాటా ఆస్పత్రిలో వైద్య సేవలకు ప్రస్తుతం ఆరోగ్యశ్రీ వర్తించదు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్కు ఆస్పత్రుల జాబితాలో మరో నెలలో చేరే అవకాశం ఉందంటున్నారు.


ధర్మశాలలో ఉచిత వసతి

క్యాన్సర్‌ వైద్యంలో రేడియేషన్‌ ప్రధానమైంది. దూరప్రాంతాల నుంచి వచ్చే రోగులు, వారి బంధువులు ఉండడానికి వసతి అవసరం. ఇటువంటి వారికి ఆశ్రయం ఇచ్చేందుకు ధర్మశాల ఉంది. ఒక దాత సహకారంతో తిరుచానూరు సమీపంలోని ఆర్యవైశ్య భవనాన్ని తాత్కాలిక ధర్మశాలగా వినియోగిస్తున్నారు. రేడియేషన్‌ చేయించుకునే రోగులను ఆస్పత్రి వాహనంలోనే  అక్కడకు చేరుస్తున్నారు. వసతి, భోజనం ఉచితంగానే అందిస్తున్నారు. మొత్తం 17 గదులు ఇక్కడ అందుటబాటులో ఉన్నాయి. ప్రతి గదిలో రెండు పడకలు ఉంటాయి. రోగితోపాటు వారి సహాయకులు ఒకరు ఉండొచ్చు. 


టీటీడీ సహకారంతో..

దేశవ్యాప్తంగా ఐదుచోట్ల దాదాపు వెయ్యి కోట్ల వ్యయంతో క్యాన్సర్‌ ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని టాటా ట్రస్ట్‌ నిర్ణయించినపుడు, అప్పటి సీఎం చంద్రబాబు చొరవతో ఆంధ్రప్రదేశ్‌కి కూడా ఆ అవకాశం లభించింది. అస్సోం, జార్ఖండ్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌లతో పాటూ తిరుపతినీ ఎంచుకుంది. టీటీడీ 25 ఎకరాల విలువైన స్థలాన్ని నామమాత్రపు ధరతో లీజుకు కేటాయించడంతో తిరుపతిలో క్యాన్సర్‌ ఆస్పత్రి నిర్మించడానికి టాటా సంస్థ సిద్ధపడింది. 2018 ఆగస్టు 31న రతన్‌ టాటాతో కలసి చంద్రబాబు నాయుడు శ్రీవేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్యాన్సర్‌ కేర్‌ అండ్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (స్వీకార్‌) పేరుతో తిరుపతిలో క్యాన్సర్‌ సెంటర్‌కు భూమిపూజ చేశారు. ఇప్పుడది పూర్తయి వైద్యసేవలు అందిస్తోంది. 


వారంలో అడ్మిషన్లు 

లాభాపేక్ష లేకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో ఆస్పత్రి నడపాలన్నదే టాటా ట్రస్టు ఉద్దేశం. శ్రీవారి పాదాల చెంత ఆ అవకాశం లభించింది. ఆస్పత్రిలో వైద్య సేవలు ప్రారంభించి రెండువారాలే అయ్యింది. ఇంకో వారంలో అడ్మిషన్లు ప్రారంభిస్తాం. ప్రస్తుతం ఓపీడీ, ఇన్వెస్టిగేషన్స్‌, రేడియోథెరపీ చేస్తున్నాం. ప్రస్తుతం 92 పడకలు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ వచ్చిన తర్వాత రోగుల సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. వైద్య సిబ్బందిని, పడకల సంఖ్యను క్రమంగా పెంచుకుంటూ వెళతాం.

Updated Date - 2022-05-21T08:04:54+05:30 IST