గుడివాడ క్యాసినోపై నిజనిర్థారణ కమిటీ: అచ్చెన్నాయుడు
ABN , First Publish Date - 2022-01-20T21:17:17+05:30 IST
సంక్రాంతి పండుగ సందర్భంగా కృష్ణా జిల్లాలోని గుడివాడలో నిర్వహించిన
అమరావతి: సంక్రాంతి పండుగ సందర్భంగా కృష్ణా జిల్లాలోని గుడివాడలో నిర్వహించిన క్యాసినోపై వాస్తవాలను వెలికి తీయడానికి టీడీపీ నిజనిర్థారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. కమిటీ సభ్యులుగా నక్కా ఆనందబాబు, వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, బోండా ఉమామహేశ్వరరావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, తంగిరాల సౌమ్య ఉంటారని ఆయన పేర్కొన్నారు. ఈ కమిటీ శుక్రవారం గుడివాడలో పర్యటిస్తుందన్నారు. గుడివాడలో పర్యటించి పూర్తి స్థాయి నివేదికను కమిటీ సేకరించి అధిష్టానానికి అందిస్తుందన్నారు. జూదాలతో రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందని ఆయన ఆరోపించారు. మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రంలో యువతను పెడదోవ పట్టించేలా నీచమైన సంస్కృతిని రాష్ట్రంలో ప్రవేశపెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.