చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే భంగపాటు తప్పదు: అచ్చెన్నాయుడు
ABN , First Publish Date - 2021-08-08T22:42:34+05:30 IST
అమరావతి: చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని స్వైరవిహారం చేస్తున్న వైసీపీ నాయకులకు.. భంగపాటు తప్పదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.
అమరావతి: చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని స్వైరవిహారం చేస్తున్న వైసీపీ నాయకులకు.. భంగపాటు తప్పదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హెచ్చరించారు. అమరావతి రాజధాని సాధనం కోసం రైతులు, ప్రజలు చేస్తున్న నిరసన దీక్షలను పోలీసులు అడ్డుకోవడంపై అయన తీవ్రంగా స్పందించారు. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. రైతుల ఉద్యమాన్ని అడుగడుగునా అడ్డుకోవడం.. జగన్ రెడ్డి అధైర్యానికి నిదర్శనమని విమర్శించారు. రాజధాని గ్రామాలు పాకిస్తాన్ సరిహద్దులను తలపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుత నిరసనలను లాఠీలతో అణచివేస్తున్న సీఎం జగన్ రెడ్డికి.. త్వరలో ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతారని చెప్పారు. ఉద్యమమే జరగలేదంటున్న వైసీపీ నాయకులు.. వేలాది మంది పోలీసులను ఎందుకు మోహరిస్తున్నారని ప్రశ్నించారు. పోలీసులు ఓవరాక్షన్ తగ్గించుకోవాలని.. ఎవరిని మెప్పించడానికి రెచ్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు శివంగులై తిరగబడితే ఏమవుతారని ప్రశ్నించారు. ఇప్పటికైనా పద్దతి మార్చుకోవాలని ఆయన హితవుపలికారు.