40 రోజులైనా కేసు నమోదు చేయరా?

ABN , First Publish Date - 2021-12-01T06:15:39+05:30 IST

మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో దాడి, విధ్వంసం జరిగి 40 రోజులవుతున్నా ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

40 రోజులైనా కేసు నమోదు చేయరా?
అర్బన్‌ ఎస్పీ కార్యాలయం వద్ద టీడీపీ నేతలు

టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిపై చర్యలు తీసుకోవాలి

న్యాయం చేయకుంటే కోర్టును ఆశ్రయిస్తాం

అర్బన్‌ ఎస్పీకి టీడీపీ నేతల వినతి

గుంటూరు, నవంబరు 30:  మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో దాడి, విధ్వంసం జరిగి 40 రోజులవుతున్నా ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం టీడీపీ గుంటూరు పార్లమెంటు అధ్యక్షుడు తెనాలిశ్రావణ్‌కుమార్‌, ఎమ్మెల్సీలు పి.అశోక్‌బాబు, మంతెన సత్యనారాయణరాజు, మాజీమంత్రులు నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, పార్టీ నాయకులు నసీర్‌ అహ్మద్‌, చిట్టాబత్తిని చిట్టిబాబు, దారూనాయక్‌, వల్లూరు కుమారస్వామి తదితరులు అర్బన్‌ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. గత నెల 19న టీడీపీ కార్యాలయంపై వైసీపీ శ్రేణులు సుమారు 200మందికి పైగా దాడి చేసి విధ్వంసం సృష్టించారన్నారు. గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బద్రీనాథ్‌కు మెడికల్‌ లీగల్‌ కేసు కావటంతో ఆయన ఫిర్యాదుపై కేసు నమోదు చేశారన్నారు. అయితే టీడీపీ కార్యాలయం విధ్వంసం ఘటనపై తాము ఇచ్చిన ఫిర్యాదుపై ఇంతవరకు కేసు నమోదు చేయలేదని పార్టీ నేతలు అర్బన్‌ ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. రాజకీయ ఒత్తిళ్లతో కేసు నమోదు చేయకపోవటం దుర్మార్గం అన్నారు. మంగళగిరి సీఐకి తాము స్వయంగా ఫిర్యాదు చేశామని, అయినప్పటికీ కేసు నమోదు చేయలేదన్నారు. అదేవిధంగా పార్టీ కార్యాలయంలోని సీసీ ఫుటేజ్‌లను పోలీసులకు అందజేశామని, అయితే తమకు ఇవ్వలేదని పోలీసులు అనటం దారుణమన్నారు. తనపైనా, అశోక్‌బాబుపైన అక్రమంగా కేసు నమోదు చేశారని ఆలపాటి రాజా అన్నారు. టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిని ప్రపంచమంతా చూసిందని, స్వయంగా సీఎం అంగీకరించారని అయినప్పటికీ పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. పోలీసులు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి, పోలీసు వ్యవస్థకు ఎంతమాత్రం మంచిదికాదన్నారు. దీనిపై ఇప్పటికైనా కేసు నమోదు చేసి చట్టప్రకారం తగు చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో తాము కోర్టును ఆశ్రయిస్తామని టీడీపీ నేతలు అర్బన్‌ ఎస్పీకి సూచించారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి సాగు, అక్రమ రవాణా జరుగుతుంటే దానిపై ప్రశ్నించినందుకే తనపైకి పోలీసులను పంపారని, దానిని ప్రశ్నించినందుకు పట్టాభిపైన, కార్యాలయంపై దాడి చేశారని ఆనందబాబు పేర్కొన్నారు. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా వంద కోట్లకు పైగా గంజాయి పట్టుబడిందని, అదంతా కూడా ఏపీ నుంచే రవాణా జరిగిందన్నారు. దానిని ప్రశ్నించినందుకే ఆ విషయం మరుగుపరచేందుకు వైసీపీ శ్రేణులు ఇటువంటి దాడులకు తెగబడ్డారన్నారు. 

Updated Date - 2021-12-01T06:15:39+05:30 IST