ఇది కూల్చివేతల ప్రభుత్వం: Chandrababu
ABN , First Publish Date - 2022-06-25T17:09:55+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం ప్రజావేదికను కూల్చివేసి మూడేళ్లు పూర్తైన సందర్భంగా ఆనాటి విధ్వంసంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా స్పందించారు.
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రజావేదికను కూల్చివేసి మూడేళ్లు పూర్తైన సందర్భంగా ఆనాటి విధ్వంసంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu naidu) ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇది కూల్చివేతల ప్రభుత్వం... ప్రజావేదిక విధ్వంసానికి మూడేళ్లు అంటూ ట్వీట్ చేశారు. ‘‘సైకో పాలన ఎలా ఉండబోతోందో ప్రజలకు చెప్పడానికి అధికారంలోకి రాగానే జగన్ రెడ్డి(Jagan reddy) చేసిన మొట్టమొదటి పని ప్రజావేదిక కూల్చివేత. కోట్ల విలువైన ప్రజల ఆస్తిని ధ్వంసం చేస్తూ... తన ఆలోచనలు ఎలా ఉంటాయో రాష్ట్రానికి సీఎం వివరించి నేటికి మూడేళ్లు. డిస్ట్రక్షన్ తప్ప కన్స్ట్రక్షన్ చేతగాని జగన్ చేసినవన్నీ కూల్చివేతలే. ఏపీ అభివృద్ధిని కూల్చాడు. రాష్ట్ర ఆర్థికస్థాయిని కూల్చాడు. ప్రజాస్వామ్య వ్యవస్థల్ని కూల్చాడు. దళితుల గూడును, యువత భవితను కూల్చాడు. ప్రజారాజధాని అమరావతిని, పోలవరం కలను కూల్చి రాష్ట్రానికి తీరనిద్రోహం చేశాడు. ప్రజావేదిక కూల్చి వికృతానందం పొందిన జగన్... మూడేళ్లలో కట్టింది మాత్రం శూన్యం. గత ప్రభుత్వం కట్టిన నిర్మాణాల్లోనే పాలన చేస్తూ... తన వల్ల ఏమీ కాదని... తనకు ఏమీ రాదని తేల్చి చెప్పేశాడు. కూల్చడం కంటే నిర్మించడం ఎంత కష్టమైన పనో మూడేళ్ల పాలన తరువాత అయినా జగన్ తెలుసుకోవాలి’’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజావేదిక అక్రమకట్టడం అంటూ కూల్చివేసిన విషయం తెలిసిందే.