అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని టీడీపీ నిర్ణయం

ABN , First Publish Date - 2022-03-05T23:32:31+05:30 IST

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీఎల్సీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని

అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని టీడీపీ నిర్ణయం

అమరావతి: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీఎల్సీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని, టీడీఎల్పీ సమావేశంలో నేతలు నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని కొందరు, వెళ్లవద్దని మరికొందరు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే అందరి సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత సమావేశాలకు వెళ్లాలని నిర్ణయించారు. తన సతీమణిని అసెంబ్లీలో దూషించడంతో భోరున విలపించడమే కాకుండా తిరిగి సీఎంగానే సభకు వస్తానని, అప్పటివరకు సభలో అడుగుపెట్టనని చంద్రబాబు శపథం చేశారు. చంద్రబాబు బాటలోనే అసెంబ్లీ వెళ్లమని మెజార్టీ ఎమ్మెల్యేలు చెబుతున్నప్పటికీ.. ప్రజా సమస్యలను ప్రస్తావించేందుకు అసెంబ్లీకి వెళ్లాలని చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది. గతంలో ఎన్టీఆర్ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించినా.. ఆయన తరపున పార్టీ అసెంబ్లీలో పోరాడిందని చంద్రబాబు గుర్తుచేసినట్లు సమాచారం.


సభకు వెళ్లినా మాట్లాడేందుకు మైక్ ఇవ్వడం లేదని, పైగా కెమెరాల్లో తమను చూపించడం లేదని ఎమ్మెల్యేలు చంద్రబాబుకు వివరించారని చెబుతున్నారు. ఇప్పటికే టీడీఎల్పీ ఉపనేతలు అచ్చెన్నాయుడు, రామానాయుడుకు మైక్ కట్ చేయాలని అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సూచించింది. ప్రివిలేజ్ కమిటీ సిఫార్సులపై అసెంబ్లీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీకి వెళ్లి ఉపయోగం లేదని టీడీపీ మెజార్టీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఇదే అంశాన్ని ఎమ్మెల్యేలు చంద్రబాబు వద్ద ప్రస్తావించగా.. 5 నుంచి 10 మంది ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ప్రజా సమస్యలపై పోరాడిన విషయాన్ని అధినేత గుర్తుచేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు మార్చి 7 నుంచి ప్రారంభంకానున్నాయి. తొలిరోజు మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి నివాళి అర్పించిన అనంతరం సభను వాయిదా వేస్తారు. మార్చి 8న ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. 

Updated Date - 2022-03-05T23:32:31+05:30 IST