పంచాయతీల అభివృద్ధికి తూట్లు

ABN , First Publish Date - 2021-07-27T04:11:05+05:30 IST

పంచాయతీల అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తూట్లు పొడుస్తోందని టీడీపీ నరసరావుపేట పార్లమెంటు అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు.

పంచాయతీల అభివృద్ధికి తూట్లు
సమావేశంలో మాట్లాడుతున్న జీవీ ఆంజనేయులు

వైసీపీ సర్కారుపై టీడీపీ నేత జీవీ ధ్వజం

వినుకొండ, జూలై 26 : పంచాయతీల అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తూట్లు పొడుస్తోందని టీడీపీ నరసరావుపేట పార్లమెంటు అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గ్రామపంచాయతీల అభివృద్ధి కేంద్రప్రభుత్వం విడుదల చేసిన 344 కోట్ల నిధులను వైసీపీ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని విమర్శించారు. గ్రామపంచాయతీలకు నిధులు ఇవ్వకపోవడంవల్ల అభివృద్ధి కుంటు పడిందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఏ పంచాయతీలోనైనా ఒక సైడ్‌కాలువ తీసిన దాఖలాలు  ఉన్నాయా? అని ఆయన ప్రశ్నించారు. మద్యం అమ్మకాలతో ప్రజలను జలగల్లా పీల్చుకుతింటున్నారని, ఆదాయం తగ్గిందని, ఆదాయం పూడ్చుకునేందుకే గనులు, మద్యంతోపాటు వేలకోట్లను దోచుకుంటున్నారని ఆరోపించారు. వైసీపీ నాయకులకు కాసులు కురిపించేందుకే పథకాలను పెట్టి ప్రజలపై భారం మోపుతున్నారన్నారు. చెత్త మీద పన్నువేయడం ఏమిటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్తపై పన్ను వేయడాన్ని నిరసిస్తూ మంగళవారం కార్యకర్తలతో కలిసి నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి షమీమ్‌, న్యాయవాది సైదారావు, పి.వి.సురేష్‌, హనుమానాయక్‌, జరపాల గోవిందునాయక్‌ తదితరులు పాల్గొన్నారు.   

Updated Date - 2021-07-27T04:11:05+05:30 IST