అయ్యన్న ఇంటి వద్ద ఏం జరిగిందంటే....

ABN , First Publish Date - 2022-06-20T02:16:41+05:30 IST

పంట కాలువ గట్టు రెండు సెంట్ల మేర ఆక్రమించుకున్నారనే అభియోగంపై తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు

అయ్యన్న ఇంటి వద్ద ఏం జరిగిందంటే....

నర్సీపట్నం: పంట కాలువ గట్టు రెండు సెంట్ల మేర ఆక్రమించుకున్నారనే అభియోగంపై తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇంటి వెనుకనున్న వంట గదిని కూలగొట్టేందుకు అధికారులు సిద్ధం కావడంతో ఆదివారం తెల్లవారుజామున అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. నర్సీపట్నం మునిసిపాలిటీ శివపురం రెవెన్యూ 276 సర్వే నంబర్‌లో జల వనరుల శాఖకు చెందిన రావణాపల్లి రిజర్వాయర్‌ పంట కాలువ గట్టు రెండు సెంట్ల మేర భూమిని అయ్యన్న ఆక్రమించుకుని ఇల్లు నిర్మించారనేది అధికారుల వాదన. ఈ మేరకు తెల్లవారు జామున నాలుగు గంటల సమయంలో నర్సీపట్నం ఏఎస్పీ మణికంఠ చందోలు, మునిసిపల్‌ కమిషనర్‌ కనకారావు, ఆర్డీఓ గోవిందరావు వంద మందికి పైగా పోలీసులతో అయ్యన్న ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇంటి వెనుక భాగంలో గోడను ఎక్స్‌కవేటర్‌తో కూల్చివేశారు. నర్సీపట్నం మునిసిపాలిటీ పరిధిలోని శివపురంలో గల మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటికి ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు ఏఎస్పీ మణికంఠ చందోలు, ఆర్డీఓ గోవిందరావు, నర్సీపట్నం మునిసిపల్‌ కమిషనర్‌ కనకారావు, సుమారు వంద మంది పోలీసులు చేరుకున్నారు.


4.00-4.30 మధ్య జేసీబీతో అయ్యన్న ఇంటి వెనుక గోడను కూల్చివేశారు.

4.30: అయ్యన్నపాత్రుడి సతీమణి పద్మావతి, ఆయన రెండో కుమారుడు రాజేష్‌ ఇంటి బయటకు వచ్చి గోడ కూల్చివేయడంపై పోలీసులను, అధికారులను నిలదీశారు. ఇరువర్గాల నడుమ వాదన కొనసాగింది.

6.00: తమను ప్రశ్నిస్తున్న వంటమనిషి వెంకాయమ్మను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. 

7.00: అయ్యన్న పెద్ద కుమారుడు విజయ్‌ ఒక ఎకరా 22 సెంట్ల భూమిలో పక్కా ఇల్లు కట్టుకోడానికి వున్న అనుమతి పత్రాలను అధికారులకు చూపించారు.

7.30: కొంతమంది టీడీపీ కార్యకర్తలు అయ్యన్న ఇంటి వద్దకు చేరుకుని నిరసనకు దిగారు. 

8.00-11.00: అటు టీడీపీ కార్యకర్తలు, నాయకులు, ఇటు పోలీసులు అయ్యన్న ఇంటి బయట వేచి ఉన్నారు.

11.00: అయ్యన్న సతీమణి పద్మావతి, కుమారుడు విజయ్‌ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను పాల్పడుతోందని ఆరోపించారు. 

3.00: విశాఖ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత, ఉమ్మడి జిల్లాలో నియోజకవర్గాల ఇన్‌చార్జులు, నాయకులు గండి బాబ్జీ, పీలా గోవింద, కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు, పీవీజీ కుమార్‌, గిడ్డి ఈశ్వరి, ప్రగడ నాగేశ్వరరావు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు తదితరులు అయ్యన్న ఇంటికి చేరుకుని కుటుంబాన్ని పరామర్శించి, కూల్చేసిన గోడను పరిశీలించారు.  

4.00: మండల సర్వేయర్‌ను తీసుకొచ్చి అయ్యన్న ఇంటి వద్ద సర్వే చేయించాలని అధికారులు భావించారు. అందుకు టీడీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ ప్రయత్నాని విరమించుకున్నారు. 

5.00: నర్సీపట్నం ఆర్డీఓ గోవిందరావుతో టీడీపీ నేతలు పల్లా శ్రీనివాసరావు, గండి బాబ్జీ చర్చలు జరిపారు. సోమవారం ఉదయం పది గంటలకు సర్వే చేయాలని నిర్ణయించారు. దీనికి అధికారులు అంగీకరించారు.

6.30: అటు పోలీసు బలగాలు, ఇటు టీడీపీ కార్యకర్తలు, నాయకులు అక్కడ నుంచి వెనుతిరిగారు. అయితే కొందరు కార్యకర్తలు మాత్రం రాత్రికి అయ్యన్న ఇంటి వద్దే ఉంటామని చెబుతున్నారు.

Updated Date - 2022-06-20T02:16:41+05:30 IST