అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం: అచ్చెన్న
ABN , First Publish Date - 2021-06-17T18:08:40+05:30 IST
ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.
అమరావతి: ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. కక్షలు, కార్పణ్యాలతో జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ కక్షతో టీడీపీ నేతలను బలిగొంటున్నారని అన్నారు. కర్నూలు జిల్లా పెసరవాయిలో టీడీపీ నేతలు వడ్డి నాగేశ్వరరెడ్డి, ప్రతాపరెడ్డిని దారుణంగా హతమార్చారని... ఈ ఘటన వెనుక వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి హస్తముందని ఆయన ఆరోపించారు. ఏపీలో ప్రజాస్వామ్యం లేదనడానికి ఈ ఘటనే నిదర్శనమన్నారు. వైసీపీ నేతలు దారుణాలకు తెగబడుతున్నా పోలీసులు చోద్యం చూడటం హేయమని అన్నారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారారని వ్యాఖ్యానించారు. హత్యా ఘటనకు పోలీసులు, ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.