జగన్ పాలనలో మహిళలకు అండ అంటే ఇదేనా: Achennaidu
ABN , First Publish Date - 2022-04-22T18:16:02+05:30 IST
నెల్లూరు కలిగిరి మండలం కుమ్మరకొండూరులో భూ ఆక్రమణకు అడ్డుకున్న సుభరత్నమ్మపై వైసీపీ నేత మహేష్ దాడిని టీడీపీ తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ నేత అచ్చెన్నాయుడు అన్నారు.
అమరావతి: నెల్లూరు కలిగిరి మండలం కుమ్మరకొండూరులో భూ ఆక్రమణకు అడ్డుకున్న సుభరత్నమ్మపై వైసీపీ నేత మహేష్ దాడిని టీడీపీ తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ నేత అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... జగన్ రెడ్డి పాలనలో మహిళలకు అండ అంటే ఇదేనా అని... ఫ్యాక్షన్ మనస్తత్వమే వైసీపీ సిద్ధాంతమని వ్యాఖ్యానించారు. దాడులు, హత్యలు, దోచుకోవడం, కబ్జాలు, దోపిడీలు చేయడమే వైసీపీ నాయకుల ప్రథమ కర్తవ్యమన్నారు. నేడు దేశంలో మహిళలపై భౌతిక దాడుల్లో ఏపీ 1వ స్థానం, లైంగిక వేధింపుల్లో 3వ స్థానంలో ఉండటానికి జగన్ రెడ్డే కారణమని ఆయన మండిపడ్డారు. మహిళలపై దిశను తీసుకువచ్చి మేలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకునే జగన్ రెడ్డి నేడు ఈ దాడులకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. మూడేళ్లల్లో వైసీపీ నేతలు దాదాపు 1500 మంది మహిళలపై దాడులు చేసినా ఇంత వరకు ఒక్క వైసీపీ నేతను అరెస్ట్ చేసిన ధాఖలాలు ఉన్నాయా అని నిలదీశారు. తాడేపల్లిలో జగన్ రెడ్డి ఇంటి సమీపంలో మహిళపై అత్యాచారం చేసిన వెంకటరెడ్డిని ఇంత వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని అడిగారు. వైసీపీ అధికారమదంతో అచ్చోసిన ఆంబోతుల్లా తిరుగుతూ మహిళలపై అక్రమాలకు పాల్పడటానికి కారణం జగన్ రెడ్డి కాదా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.