తెలుగు బీసీ మహిళా నేతల్ని వేధించడం దుర్మార్గం: Achennaidu
ABN , First Publish Date - 2021-11-25T16:21:01+05:30 IST
చంద్రబాబు నాయుడు సతీమణిపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యల్ని ఖండించిన అనంతపురం తెలుగు బీసీ మహిళా నేతల్ని పోలీసులు వేధించటం
అమరావతి: చంద్రబాబు నాయుడు సతీమణిపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యల్ని ఖండించిన అనంతపురం తెలుగు బీసీ మహిళా నేతల్ని పోలీసులు వేధించటం దుర్మార్గమని టీడీపీ రాష్ట్ర అధ్యక్ష్యులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. బూతులు మాట్లాడిన వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలను వదిలేసి బూతులు మాట్లాడొద్దన్నందుకు తెలుగు మహిళలను వేధిస్తారా అని ప్రశ్నించారు. వారు చేసిన తప్పేంటి?... వైసీపీ నేతలు మహిళలను అసభ్యంగా మాట్లాడుతుంటే సాటి మహిళలుగా స్పందించటం తప్పా అని నిలదీశారు. మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడిన వైసీపీ ప్రజాప్రతినిధులకు భద్రత పెంచిన ప్రభుత్వం... మహిళలను కించపరిచేలా మాట్లాడొద్దంన్నందుకు తెలుగు మహిళలను అరెస్టు చేస్తామని బెదిరించటం సిగ్గుమాలిన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టు చేయాల్సింది తెలుగు మహిళలను కాదని... అసెంబ్లీ సాక్షిగా స్త్రీ జాతిని అవమానించిన వైసీపీ మంత్రి, ఎమ్మెల్యేలను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మహిళల పట్ల వైసీపీ నేతల వ్యహహారశైలి, భాష ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు. ముఖ్యమంత్రికి మహిళలపై గౌరవం ఉంటే అసెంబ్లీలో మహిళలను అవమానించిన వారిని పదవుల నుంచి తొలగించి మహిళలకు క్షమాపణలు చెప్పాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.