బ్రిటీష్ నియంత పాలన 2.0 లా జగన్ రెడ్డి పాలన: Achennaidu
ABN , First Publish Date - 2021-12-17T16:00:20+05:30 IST
బ్రిటీష్ నియంత పాలన 2.0లా జగన్ రెడ్డి పాలన ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: బ్రిటీష్ నియంత పాలన 2.0లా జగన్ రెడ్డి పాలన ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడుతున్న వారికి ఆంక్షలు, సంకెళ్లు విధిస్తూ జగన్ రెడ్డి నియంత పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. రైతుల పాదయాత్ర విజయవంతం కావటంతో వైసీపీ నేతలు కడుపుమంటతో బాధపడుతున్నారని... అందుకే అమరావతి రైతుల మహాసభకు కోర్టు అనుమతిచ్చినా.. ప్రజలు సభకు వెళ్లకుండా ఎక్కడిక్కడ వైసీపీ అడ్డంకులు సృష్టిస్తోందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల నిరవధిక దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న టీడీపీ నేతల్ని హౌస్ అరెస్టు చేస్తున్నారని అన్నారు. వైసీపీ 3 ఏళ్ల పాలనలో పోలవరంలో ఏ పనులు చేశారో, పోలవరం నిర్వాసితులకు ఏం న్యాయం చేశారో మంత్రి, ముఖ్యమంత్రి చెప్పగలరా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నిస్తే.. అక్రమ అరెస్టులు, ప్రజా సమస్యలపై పోరాడుతుంటే.. ఆంక్షలతో అడ్డుకోవటం ఏంటి? ఇదెక్కడి ప్రజాస్వామ్యం? అని నిలదీశారు. ప్రతిపక్షంలో నోటికొచ్చినట్టు హామిలిచ్చి అధికారంలోకి వచ్చాక మోసం చేస్తారా? అంటూ అచ్చెన్నాయుడు అగ్రహం వ్యక్తం చేశారు.