నీ తండ్రివి తప్ప ఎవరి విగ్రహాలు ఉండకూడదా?: Achennaidu
ABN , First Publish Date - 2022-01-03T19:19:26+05:30 IST
గుంటూరు జిల్లాలోని దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహంపై వైసీపీ నేత దాడి చేయడంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
అమరావతి: గుంటూరు జిల్లాలోని దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని వైసీపీ నేత ధ్వంసం చేయడంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో నీ తండ్రి విగ్రహాలు తప్ప మహానుభావులవి ఉండకూడదా అంటూ సీఎం జగన్ను ప్రశ్నించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ విగ్రహ ధ్వంసానికి పాల్పడి, మారణాయుధాలతో ప్రజలను భయపెట్టిన వారిపై ఐపీసీ 294, 427 లాంటి నామమాత్రపు కేసులు పెట్టారన్నారు. హత్యాయత్నం కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. విగ్రహ ధ్వంసాన్ని నిరసిస్తూ ఆందోళన తెలిపిన వారిపై క్రిమినల్ కేసులు బనాయిస్తారా అని మండిపడ్డారు. టీడీపీ వారిపై పెట్టిన కేసులను తక్షణమే పోలీసులు వెనక్కి తీసుకుని, అరెస్టు చేసిన వారిని వదిలిపెట్టాలని డిమాండ్ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్, అంబేద్కర్ విగ్రహాలను ఇష్టానుసారంగా ధ్వంసం చేస్తున్నారన్నారు. భావితరాలకు స్ఫూర్తినిచ్చే వ్యక్తుల విగ్రహాల జోలికి వెళ్లొద్దని వైసీపీని హెచ్చరిస్తున్నామని అన్నారు. విగ్రహాలు కూల్చి రాజకీయాలనుకుంటే ప్రజలు విశ్వసించరని తెలిపారు. మరోసారి ఎన్టీఆర్ విగ్రహాల జోలికివస్తే ఊరుకునేది లేదని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.