జగనన్న సొంతింటి కళ సాకారం అయ్యే సూచనలు లేవు: Alapati raja
ABN , First Publish Date - 2022-06-14T18:28:09+05:30 IST
జగనన్న సొంతింటి కళ సాకారం అయ్యే సూచనలు లేవని మాజీ మంత్రి ఆలపాటి రాజా అన్నారు.
గుంటూరు: జగనన్న సొంతింటి కళ సాకారం అయ్యే సూచనలు లేవని మాజీ మంత్రి ఆలపాటి రాజా అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో 28 లక్షల ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారని, 17వేల కాలనీలు నిర్మిస్తున్నట్లు గొప్పలకు పోయారన్నారు. పట్టణాల్లో ఉన్న వారిని ఇళ్ల స్థలాల పేరుతో గ్రామాలకు తీసుకెళ్లారని తెలిపారు. ఇప్పుడు లబ్ధిదారులే కట్టుకోవాలని చెబుతున్నారని మండిపడ్డారు. ఇంటి నిర్మాణం కోసం 5 లక్షలకు పైగా వ్యయం అవుతోందని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే నిధులు ఇంటి నిర్మాణానికి ఏ మాత్రం సరిపోవడం లేదన్నారు. జగనన్న కాలనీల్లో రోడ్డు, నీరు, కరెంటు వంటి మౌలిక వసతులు లేవని ఆయన విమర్శించారు.
కేవలం 2 శాతం ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయని... మరి ప్రభుత్వం చెప్పిన లక్షల ఇళ్లు ఎప్పుడు నిర్మిస్తారని ప్రశ్నించారు. ఇంటి నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చే లక్షా 80 వేలు తప్ప రాష్ట్ర ప్రభుత్వం పైసా కూడా ఇవ్వటం లేదన్నారు. నిధులు కేంద్రానివి, పేరు మాత్రం రాష్ట్ర ప్రభుత్వానిదా అని నిలదీశారు. టీడీపీ ప్రభుత్వంలో రెండున్నర లక్షలకు పైగా ఇళ్లు నిర్మాణం పూర్తయితే వాటిని లబ్ధిదారులకు ఇవ్వటం లేదని ఆలపాటి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు.