దోచేస్తున్న జగన్‌ను ప్రజలు నిలదీయకపోతే ఎలా?: అయ్యన్నపాత్రుడు

ABN , First Publish Date - 2021-04-23T15:36:14+05:30 IST

దేశంలో ఏ రాష్ట్రంలో జరగని దోపిడీకి పనికిమాలిన జగన్ రెడ్డి పాల్పడుతున్నారని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు విమర్శలు గుప్పించారు.

దోచేస్తున్న జగన్‌ను ప్రజలు నిలదీయకపోతే ఎలా?: అయ్యన్నపాత్రుడు

అమరావతి: దేశంలో ఏ రాష్ట్రంలో జరగని దోపిడీకి పనికిమాలిన జగన్ రెడ్డి పాల్పడుతున్నారని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు విమర్శలు గుప్పించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ అలీబాబా 40 దొంగలముఠా దెబ్బకు రాష్ట్రం ఎలా సర్వనాశనమవుతోందో ప్రజలంతా గ్రహించాలన్నారు. ఇసుక, మద్యం, మట్టి, భూములను దోచేస్తున్న దొంగలముఠా నాయకుడు ఇప్పుడు పోలవరంపై కన్నేశాడన ఆరోపించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో రూ.780కోట్లు ఆదాచేశామని అసెంబ్లీలో జగన్ రెడ్డి డబ్బా కొట్టారని...రూ.780కోట్లు ఆదా చేసిన వ్యక్తి, ఇప్పుడు ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.3222 కోట్లకు ఎందుకు పెంచారని ప్రశ్నించారు. పోలవరం అంచనా వ్యయం పెంపుపై రాత్రికి రాత్రి జీవో ఇచ్చిన జగన్ రెడ్డి దొంగల ముఠా రూ.2500 కోట్ల వరకు కొట్టేసిందని వ్యాఖ్యానించారు. ప్రాజెక్ట్ నిర్మాణ ప్రదేశంలో ఇసుక అందుబాటులో ఉంటే, దాని కోసం రూ.500 కోట్లు కేటాయించారని మండిపడ్డారు. ఈ రెండేళ్లలో పోలవరం అంచనాలు పెంచి రూ.3,222 కోట్లు దోచేసింది వాస్తవమో కాదో జగన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.


చంద్రబాబు నిర్మించిన పట్టిసీమ దండగన్న జగన్ రెడ్డి, నేడు మరో ఎత్తిపోతల పథకానికి రూ.912 కోట్లు ఎందుకు కేటాయించారని నిలదీశారు. పట్టిసీమతో పాటు, మరో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉండగా, పోలవరం కుడికాలుపై ఎత్తిపోతల పథకం అవసరమా అని అన్నారు. కేవలం దోపిడీ కోసమే జగన్ రెడ్డి రూ.912 కోట్లకు ఎత్తిపోతల పథకం పేరుతో ఎసరు పెట్టారని ఆరోపించారు. ఎక్కడికక్కడ అందినకాడికి దోచేస్తున్న జగన్ రెడ్డిని ప్రజలు నిలదీయకపోతే ఎలా అని అయ్యన్న ప్రశ్నించారు. తన ప్రభుత్వంలో పోలవరం ఎంత పూర్తి చేశాడో, నిర్మాణానికి ఎంత ఖర్చుపెట్టాడో ప్రజలందరికీ అర్థమయ్యేలా జగన్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోరంబోకు విజయసాయిరెడ్డికి చంద్రబాబు గొప్పతనం ఏం తెలుస్తుందని అన్నారు. తెలంగాణకు వచ్చే ఆదాయంలో 70 శాతం చంద్రబాబు ఆలోచనల్లో నుంచి పుట్టిందే అని ఆయన తెలిపారు. దేశంలో ఎక్కడికెళ్లి ఏపీ పేరు చెప్పినా... బాబుగారి రాష్ట్రమా అని అంటారన్నారు. పోలవరం నిర్మాణాన్ని 70 శాతం పూర్తి చేసి చూపించారని... అదీ చంద్రబాబు ఘనత అని చెప్పుకొచ్చారు. అటువంటి మహానేత విలువ జైలుపక్షి,  420 అయిన విజయసాయిరెడ్డికెలా తెలుస్తుందని మండిపడ్డారు. జగన్ రెడ్డి బుద్ధి లేకుండా విజయసాయిని పెద్దలసభకు పంపారని అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 

Updated Date - 2021-04-23T15:36:14+05:30 IST