‘సొంత వర్గానికి పంచభక్ష పరమన్నాలు.. బడుగులకు గంజినీళ్లా.?’
ABN , First Publish Date - 2021-07-23T16:01:04+05:30 IST
ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డిపై టీడీపీ నేత బీదా రవిచంద్ర యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డిపై టీడీపీ నేత బీదా రవిచంద్ర యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సొంత వర్గానికి పంచభక్ష పరమన్నాలు.. బడుగులకు గంజినీళ్లా.? అని మండిపడ్డారు. నిధుల్లేని పదవులిచ్చి ఉద్దరించామనడం దుర్మార్గమన్నారు. మోసం, దగా రెండు కళ్లుగా జగన్ పాలన సాగుతోందని తెలిపారు. జగన్ మోసం చేయని వర్గం లేదని, దగా చేయని పథకం లేదన్నారు. రాష్ట్ర స్థాయి ప్రతిష్టాత్మక పదవుల్ని సొంత వారికి కట్టబెట్టారని....అధికారాలు, నిధులు లేని పదవుల్ని బలహీన వర్గాలకు కట్టబెట్టారని ఆరోపించారు. సామాజిక న్యాయం పేరుతో దగా చేస్తున్నారని అన్నారు. సంక్షేమ పేరుతో మోసం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. టీడీపీ హయాంలో బడుగులకు 60శాతం పదవులు ఇస్తే...జగన్ రెడ్డి దాన్ని 50 శాతానికి కుదించారన్నారు. పదవుల పేరుతో అంకెల గారడీ చేశారన్నారు. క్విడ్ ప్రోకో లెక్కల గారడీని సంక్షేమంలోనూ చూపుతున్నారని బీదా రవింద్ర యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.