ఏపీలో పెట్రో బాదుడిపై Chandrababu ట్వీట్

ABN , First Publish Date - 2022-05-23T17:11:22+05:30 IST

రాష్ట్రంలో భారంగా మారిన పెట్రో ధరలు తగ్గించాలి అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.

ఏపీలో పెట్రో బాదుడిపై Chandrababu ట్వీట్

అమరావతి: రాష్ట్రంలో భారంగా మారిన పెట్రో ధరలు తగ్గించాలి అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ట్వీట్టర్ వేదికగా స్పందిస్తూ... నాడు అభివృద్ధిలో దేశంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం... ఇప్పుడు పన్నుల భారంలో మొదటి స్థానంలో ఉందన్నారు. పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరల నుంచి దేశ ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. అదే సమయంలో ఆయా  రాష్ట్రాలను కూడా పన్నులు తగ్గించుకుని ప్రజలకు మేలు చేయమంటూ కేంద్రం పిలుపును ఇవ్వడం ప్రశంసనీయమన్నారు. తెలుగుదేశం హయాంలో అభివృద్ధిలో దేశంలో మొదటి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం... ఇప్పుడు పెట్రో బాదుడులో దేశంలోనే మొదటి స్థానంలో ఉందని వ్యాఖ్యానించారు. పెట్రో ధరల బాదుడుతో సామాన్యుడి జీవితంపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. నిత్యావసర వస్తువుల ధరల భారానికి ఇది కారణం అవుతోందని తెలిపారు. ఎన్ని విజ్ఞప్తులు చేసినా, ప్రజలు భారం మోయలేక పోతున్నా ప్రభుత్వం మాత్రం పెట్రో బాదుడు నుంచి ఉపశమనం కలిగించలేదని టీడీపీ అధినేత మండిపడ్డారు.


గతేడాది చివర్లో దేశంలో అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సొంత పన్నులు తగ్గించుకున్నాయని గుర్తుచేశారు. ఏపీలో ఇప్పటికీ పైసా తగ్గించకపోగా... అదనపు పన్నులతో మరింత బాదేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు కేంద్రం పెట్రోల్‌పై రూ.8లు, డీజిల్‌పై రూ.6లు పన్ను తగ్గించుకుందన్నారు. ఇప్పటికే రాజస్థాన్, ఒడిశా, తమిళనాడు ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో పన్నులు తగ్గించాయని తెలిపారు.  మరి ఏపీ ప్రజలు ఏం పాపం చేసారని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం వెంటనే పన్ను తగ్గించుకుని రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కలిగించాలని చంద్రబాబు ట్వీట్ చేశారు. 

Updated Date - 2022-05-23T17:11:22+05:30 IST