ఇసుక కొరతపై చంద్రబాబు అధ్యక్షతన నిరసన

ABN , First Publish Date - 2020-12-02T15:05:18+05:30 IST

ఇసుక కొరత, నూతన ఇసుక విధానానికి నిరసనగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన

ఇసుక కొరతపై చంద్రబాబు అధ్యక్షతన నిరసన

అమరావతి: ఇసుక కొరత,  నూతన ఇసుక  విధానానికి నిరసనగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం ఉదయం ఆ పార్టీ నేతలు నిరసనకు దిగారు. తాపీ పనిముట్లు, బంగారం కొలిచే త్రాసుతో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి కాలినడకన వెళ్లారు. ఇసుక ధరల పెంపు, ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కొల్పోయారంటూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. గతంలో ఉచితంగా మారిన ఇసుక నేడు భారంగా మారిందని విమర్శలు గుప్పిస్తున్నారు. 




శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు మాట్లాడుతూ...రాష్ట్రంలో నెలకొన్న ఇసుక సమస్య వల్ల 30లక్షల మంది పరిస్థితి దుర్భరంగా మారిందన్నారు. టీడీపీ అమలు చేసిన ఉచిత ఇసుకను రద్దు చేసి కృత్రిమ కొరత సృష్టించారని విమర్శించారు. పనుల్లేక ఆత్మహత్య చేసుకున్న భవననిర్మాణ కార్మికులవి అన్నీ ప్రభుత్వ హత్యలే అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక విధానం అవినీతి విధానం అని పత్రికల్లో ప్రకటనలిచ్చి మరీ ఒప్పుకున్నారన్నారు. కొత్త విధానంపై ముఖ్యమంత్రి, మంత్రి పొంతన లేని మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సొంత మనుషులకు ఇసుక కాంట్రాక్ట్ కట్టబెట్టేందుకు డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా మనస్సు మార్చుకుని ఉచిత ఇసుక విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. 18నెలలుగా జరిగిన ఇసుక దోపిడీ జే-ట్యాక్స్ కి వెళ్ళిందని అచ్చెన్నాయుడు ఆరోపించారు.


 శాసన సభాపక్ష ఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ...ఇసుక మాఫియా రాష్ట్రంలో రాజ్యమేలుతోందన్నారు. నాణ్యమైన ఇసుకను పొరుగు రాష్ట్రాలకు తరలిస్తున్నారని... నాసిరకం ఇసుకను రాష్ట్రంలో పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. మైనింగ్ మాఫియాను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. దోపిడీకి అడ్డుకట్ట పడుతుందనే ఉచిత ఇసుకను అమలు చేయట్లేదని విమర్శించారు.


నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ.. భవననిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎవ్వరూ ఇళ్లు కట్టుకోలేని పరిస్థితి నెలకొందని అన్నారు. 

Updated Date - 2020-12-02T15:05:18+05:30 IST