Chennupati Gandhi Caseపై పోలీసుల పొంతనలేని సమాధానం

ABN , First Publish Date - 2022-09-08T19:47:38+05:30 IST

: టీడీపీ నేత చెన్నుపాటి గాంధీ కేసుపై పోలీసులు పొంతనలేని సమాధానం చెబుతున్నారు.

Chennupati Gandhi Caseపై పోలీసుల పొంతనలేని సమాధానం

అమరావతి: టీడీపీ నేత చెన్నుపాటి గాంధీ (Chennupati gandhi) కేసుపై పోలీసులు పొంతనలేని సమాధానం చెబుతున్నారు. విజయవాడ సెంట్రల్ జోన్ ఏసీపీ ఖాదర్ భాషా (ACP Khader Bhasha) మీడియాతో మాట్లాడుతూ... చెన్నుపాటి గాంధీ (TDP Leader) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే ఎఫ్ఐఆర్ నమోదు చేశామని తెలిపారు. బాధితుడి ఫిర్యాదుతో పాటు, ఆసుపత్రి ఇచ్చిన నివేదికలో మారణాయుధంతో దాడి జరిగిందని ఉన్నప్పటికీ న్యాయ సలహా తీసుకునే హత్యాయత్నం సెక్షన్ పెట్టలేదని ఏసీపీ చెప్పారు.


ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రితో పాటు ప్రాథమిక చికిత్స చేసిన సూరపనేని ఆసుపత్రి వాళ్ళు కూడా కన్ను పోయే ప్రమాదం ఉందనే నివేదికలు ఇచ్చాయన్నారు. గాంధీ (TDP)కి శస్త్ర చికిత్సలు ఇంకా కొనసాగుతున్నందున తుది వైద్య నివేదికను కోర్టు ముందు పెట్టలేదని తెలిపారు. తుది వైద్య నివేదిక వచ్చే వరకు సున్నితమైన అంశంలో నిందితుల్ని కోర్టు ముందు పెట్టకుండా ఉండలేం కదా అంటూ చెప్పుకొచ్చారు. కాగా.. ఆయుధం స్వాధీనంపై ఏసీపీ ఖాదర్ భాష ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కేసు ఇంకా విచారణ దశలో ఉంది కాబట్టి ఇంతకంటే ఏం చేప్పలేమని సమాధానమిచ్చారు. ఎఫ్ఐఆర్ ఆధారంగానే ముందుకెళ్తున్నామని ఏసీపీ స్పష్టం చేశారు. 


పటమట పీఎస్‌ వద్ద టీడీపీ ఆందోళన..ఉద్రిక్తం

కాగా... నాలుగు రోజుల క్రితం టీడీపీ నేత(TDP Leader) చెన్నుపాటి గాంధీపై వైసీపీ నేతలు (YCP Leaders) దాడి చేసిన విషయం తెలిసిందే. పటమటలంకలోని గర్ల్స్‌హైస్కూల్‌ వద్ద చెన్నుపాటి దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో టీడీపీ నేత కంటికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా.. ప్రథమ చికిత్స అనంతరం హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి తరలించారు. చెన్నుపాటి గాంధీపై దాడిని టీడీపీ శ్రేణులు తీవ్రంగా ఖండించారు. ఈరోజు ఉదయం విజయవాడ పటమట పోలీస్ స్టేషన్‌ను టీడీపీ నేతలు నల్లబ్యాడ్జీలు పెట్టుకుని  చుట్టుముట్టారు.  చెన్నుపాటి గాంధీపై హత్యాయత్నం జరిగితే, పోలీసులు కేసు నీరుగార్చుతున్నారని వారు ఆరోపించారు. 


చెన్నుపాటి గాంధీపై జరిగిన హత్యాయత్నంలో గాయం నివేదిక లేకుండా పోలీసులు కోర్టుకు రిమాండ్ రిపోర్టు సమర్పించిన తీరును నిరసిస్తూ ఆందోళన  చేపట్టారు. పోలీస్ ఎఫ్ఐఆర్ కాపీలు, వైద్యుల నివేదికలు పట్టుకుని పోలీస్ స్టేషన్ వద్ద టీడీపీ ధర్నాకు దిగింది. పోలీస్ స్టేషన్ వద్ద ఎఫ్ఐఆర్ కాపీలను తగలపెట్టారు. పదునైన మెటల్‌తో దాడి చేయటం వల్లే కంటికి గాయమైందని వైద్యులు నివేదిక ఇచ్చినా పోలీసులు నిందితుల్ని కాపాడే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలను కాపాడేందుకు కేసును నీరుగారుస్తున్న పోలీసులపై ప్రైవేటు కేసులు వేస్తామని తెలుగుదేశం నేతలు స్పష్టం చేశారు. నిరసనలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, పొలిట్ బ్యూరో సభ్యులు నియోజకవర్గ ఇన్ఛార్జ్‌లు పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-08T19:47:38+05:30 IST