AP News: సీఎం జగన్ ఆధ్వర్యంలో వైసీపీలో చేరిన టీడీపీ నేత
ABN , First Publish Date - 2022-08-29T19:57:46+05:30 IST
మంగళగిరి టీడీపీ నేత గంజి చిరంజీవి సీఎం జగన్ ఆధ్వర్యంలో వైసీపీ కండువా కప్పుకున్నారు.
తాడేపల్లి (Tadepalli): మంగళగిరి టీడీపీ నేత గంజి చిరంజీవి (Ganji Chiranjeevi), కుటుంబ సభ్యులు.. సోమవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరారు. వారికి సీఎం జగన్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గంజి చిరంజీవి మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి 12 ఓట్లతో ఓడిపోయానన్నారు. జగన్ సారథ్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని, ముఖ్యమంత్రి ఇస్తున్న ప్రాధాన్యతను చూసి వైసీపీ (YCP)లో చేరినట్లు చెప్పారు.
రానున్న రోజుల్లో అధిష్టానం ఏ ఆదేశాలు ఇచ్చినా, ఎలా వినయోగించుకున్నా అంకితభావంతో పనిచేస్తానని గంజి చిరంజీవి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తానన్నారు. నారా లోకేష్ నిల్చున్నా వైసీపీకి ఎలాంటి నష్టం ఉండదన్నారు. గత ఎన్నికల కన్నా ఎక్కువ మెజారిటీతో మంగళగిరిలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఎవరి పేరు చెప్పినా కలసి పనిచేసి వైసీపీని గెలిపిస్తామని గంజి చిరంజీవి అన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.