ప్రజాభిప్రాయ సేకరణకు భయమెందుకు?: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు

ABN , First Publish Date - 2020-08-07T18:34:14+05:30 IST

ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా మూడు రాజధానుల ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్న..

ప్రజాభిప్రాయ సేకరణకు భయమెందుకు?: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు

రాజాం(శ్రీకాకుళం): ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా మూడు రాజధానుల ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి జగన్‌.. ప్రజల వద్దకు వెళ్లి రెఫరెండం తీసుకోవడానికి ఎందుకు భయపడుతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు ప్రశ్నించారు. గురువారం రాజాం క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడైనా.. ఎప్పుడైనా రాజధానిని మార్చడం ఉందా? అని ప్రశ్నించారు. మూడు రాజధానుల ఏర్పాటుపై ప్రజాభిప్రాయానికి సిద్ధమేనా అని ఈ నెల 3న సవాల్‌ విసిరినా.. ఇప్పటివరకూ వైసీపీ నేతలు ఎవరూ స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. 


151 ఎమ్మెల్యే స్థానాలు దక్కించుకున్నామని.. ఎదురులేని ప్రజాబలం ఉందని చెప్పుకుంటున్న జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారని మండిపడ్డారు. మూడు రాజధానుల నిర్ణయం సరైనదేనని భావిస్తే.. అందరూ రాజీనామా చేసి రండి. ఎన్నికలకు వెళ్దాం అని సవాల్‌ విసిరారు. ‘అయోధ్యలో సుదీర్ఘకాలంగా ఎన్నో వివాదాలు, కోర్టుల చుట్టూ తిరిగిన రామాలయ నిర్మాణం అంశం పరిష్కారమైంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు వేల పుణ్యక్షేత్రాల నుంచి పవిత్ర మట్టి, వంద నదుల నుంచి పుణ్యజలాలు తెప్పించి.. రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ‘అమరావతి’కి కూడా ప్రధానమంత్రి నరేంద్రమోదీయే శంకుస్థాపన చేశారు.


శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు రాష్ట్రంలో 13వేల గ్రామాలు.. 3వేల వార్డుల నుంచి ‘మనమట్టి-మననీరు’ తెచ్చి రాజధానికి అభిషేకం చేశారు. పవిత్ర యజ్ఞంగా.. పుణ్యకార్యక్రమంగా రాజధాని నిర్మాణం చేపట్టాం. అమరావతి కూడా దేవతల రాజధాని వంటిదే. అందరూ దీనికే కట్టుబడి ఉండాలి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ నిర్ణయం ఉండాలి. ప్రజాభిప్రాయ సేకరణకు అనుకూలంగా రాజధాని నిర్మాణం చేపట్టాలి’ అని కళా వెంకటరావు సూచించారు.


Updated Date - 2020-08-07T18:34:14+05:30 IST