సజ్జల తనపై తానే కేసు పెట్టుకుంటాడా?: సూర్యప్రకాష్
ABN , First Publish Date - 2021-05-11T19:09:40+05:30 IST
రుయా ఆసుపత్రి ఘటనలో ప్రభుత్వం తక్షణమే వాస్తవాలు బయటపెట్టాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్ డిమాండ్ చేశారు.
అమరావతి: రుయా ఆసుపత్రి ఘటనలో ప్రభుత్వం తక్షణమే వాస్తవాలు బయటపెట్టాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్ డిమాండ్ చేశారు. ఘటన జరిగే సమయానికి ఎందరు రోగులున్నారు.. ఎందరు చనిపోయారు..ఎందరి పరిస్థితి విషమంగా ఉందో తక్షణమే వెల్లడించాలన్నారు. ప్రతిపక్షనేతపై, పత్రికలపై రాజద్రోహ నేరం కింద కేసులు పెట్టాలంటున్న సజ్జల... రుయా ఘటనకు సంబంధించి ఎవరిపై కేసులుపెడతారని ప్రశ్నించారు. మరణాలకు కారకుడైన ముఖ్యమంత్రిపైనా..లేక మొద్దునిద్ర పోతున్న ప్రభుత్వంపైనా? ...లేక 24 నెలలుగా సలహాదారుగా కొనసాగుతున్న సజ్జల తనపై తానే కేసు పెట్టుకుంటాడా? అని నిలదీశారు. రుయా ఘటనకు ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. విజయనగరం ఘటన జరిగినప్పుడే ముఖ్యమంత్రి స్పందించి ఉంటే రుయాలో చావులు సంభవించేవికావన్నారు. నిన్న రాత్రి 8 గంటలకు ఘటన జరిగితే ఈరోజు ఉదయం 8 గంటలకు ఆరోగ్యశాఖా మంత్రి ఆరాలు తీస్తారా అని మండిపడ్డారు. ఘటన జరిగిన వెంటనే అక్కడికి వెళ్లాల్సిన బాధ్యత మంత్రికి లేదా అని సూర్యప్రకాశ్ ప్రశ్నించారు.