కేశినేని నాని చెప్పు చేతల్లో మేము ఉండాలా..: నాగుల్ మీరా

ABN , First Publish Date - 2021-03-06T18:11:57+05:30 IST

టీడీపీ ఎంపీ కేశినేని నానిపై ఆ పార్టీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేశినేని నాని చెప్పు చేతల్లో మేము ఉండాలా..: నాగుల్ మీరా

విజయవాడ: టీడీపీ ఎంపీ కేశినేని నానిపై ఆ పార్టీ అధికార ప్రతినిధి  నాగుల్ మీరా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేశినేని నాని మాట్లాడే ప్రతిమాట కులహంకారంతో మాట్లాడుతున్నారని అన్నారు. బడుగు, బలహీనవర్గాలను కించపరిచే విధంగా ఉందన్నారు. పశ్చిమంలో కేశినేని పెత్తనం ఏంటి అని ప్రశ్నించారు. పార్టీని నమ్ముకొని, పార్టీ కోసం పని చేసిన నాయకులం తామని చెప్పుకొచ్చారు. కేశినేని ఏకపక్ష ధోరణితో కార్యకర్తలు, నాయకులు విసిగిపోయారన్నారు. టీడీపీకి బడుగు, బలహీనవర్గాలు పట్టుకొమ్మలని..అలాంటి వర్గాలను కేశినేని నాని...నరికేస్తున్నాడని విమర్శించారు.


టీడీపీ పార్టీకి బడుగు, బలహీనవర్గాలు కట్టుబానిసలు అనుకుంటున్నారా? అని నిలదీశారు. బడుగు, బలహీనవర్గాల ప్రజలు కేశినేని నాని తీరుపై తమను నిలదీస్తున్నారని తెలిపారు. పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళం తామని స్పష్టం చేశారు. చంద్రబాబును విమర్శించేలా అధికార పార్టీ నేతలు తిడుతుంటే నోరు ఎందుకు మెదపవు కేశినేని అని ప్రశ్నించారు. ‘‘కేశినేని కులానికి నువ్వు గొప్ప అయితే...మా కులాలకు మేము గొప్ప. నిన్ను చూసి మా కులలవారు ఓట్లు వేయరు...మేము చెబితేనే ఓట్లు వేస్తారు. మేము ఎప్పటికీ చంద్రబాబుకు, టీడీపీకి విధేయులం... కానీ ఆత్మాభిమాన్ని చంపుకుని పార్టీలో ఇమడలేం. బడుగు, బలహీనవర్గాలు మీ చెప్పు చేతల్లో ఉండాలా. ఆ రోజులు పోయాయి...బడుగు, బలహీనవర్గాలు తలుచుకుంటే ప్రభుత్వాలు తారుమారు అవుతాయి’’ అంటూ నాగుల్ మీరా హెచ్చరించారు. 

Updated Date - 2021-03-06T18:11:57+05:30 IST