జగన్ జమానాలో మద్యపాననిషేధం అనేది మిథ్యేనని తేలిపోయింది: Nakka anand
ABN , First Publish Date - 2021-09-07T19:24:00+05:30 IST
అధికారంలోకి రాకముందు దశలవారీ మద్యపాన నిషేధమని చెప్పిన జగన్ రెడ్డి, నేడు దశలవారీగా మద్యం దుకాణాలు పెంచుతున్నారని టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
అమరావతి: అధికారంలోకి రాకముందు దశలవారీ మద్యపాన నిషేధమని చెప్పిన జగన్ రెడ్డి, నేడు దశలవారీగా మద్యం దుకాణాలు పెంచుతున్నారని టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వాక్ ఇన్ స్టోర్స్ పేరుతో పట్టణ ప్రాంతాల్లో 300 దుకాణాలు, పర్యాటకం ముసుగులో 175 దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు. ఇప్పటికే మద్యం అమ్మకాలను సాకుగా చూపి, జగన్ రెడ్డి రూ.25 వేలకోట్ల వరకు అప్పులు తెచ్చారని విమర్శించారు. రాబోయే 15 ఏళ్లకు ముందుగానే మందుబాబులను అప్పు కోసం తనఖా పెట్టేశారని అన్నారు. మద్యం అమ్మకాల కోసం ప్రతి 50 ఇళ్లకు ఒక సేల్స్ మెన్ను నియమించారన్నారు. సంవత్సరానికి రూ.5వేలకోట్ల చొప్పున ఐదేళ్లకు రూ.25 వేలకోట్లు మద్యం అమ్మకాలపై రాబడుతూ, ప్రజల ఆరోగ్యాన్ని తన ఆదాయంగా మార్చుకున్నారని ఆరోపించారు. వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు నాటుసారా అమ్మకాలను, పొరుగు రాష్ట్రాల మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి జమానాలో మద్యపాన నిషేధం అనేది మిథ్యేనని తేలిపోయిందని నక్కా ఆనంద్ బాబు విమర్శించారు.