వసంత కృష్ణ ప్రసాద్ కనుసన్నల్లోనే మైనింగ్ మాఫియా: Panchumarthi

ABN , First Publish Date - 2021-07-30T19:18:54+05:30 IST

ఓబుళాపురం మైనింగ్‌కు మించిన దోపిడీ మైలవరంలో జరుగుతోందని టీడీపీ ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ విమర్శించారు.

వసంత కృష్ణ ప్రసాద్ కనుసన్నల్లోనే మైనింగ్ మాఫియా: Panchumarthi

అమరావతి: ఓబుళాపురం మైనింగ్‌కు మించిన దోపిడీ మైలవరంలో జరుగుతోందని టీడీపీ ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆంధ్రా డేరా బాబా అని మైలవరం ప్రజలే చెబుతున్నారన్నారు. వసంత కృష్ణ ప్రసాద్ కనుసన్నల్లోనే మైనింగ్ మాఫియా నడుపుతున్నారని ఆరోపించారు. రౌడీ షీటర్లు, రేప్ కేస్ నిందితులు, ఇసుక దందా రాయుళ్లను పక్కన పెట్టుకుని కృష్ణ ప్రసాద్ నీతులు చెబితే ఎవరు నమ్ముతారని మండిపడ్డారు. అక్రమ మైనింగ్ పై ప్రశ్నించినందుకే దేవినేని ఉమాపై కక్ష కట్టారన్నారు.  దళితుల రక్షణకు ఏర్పాటు చేసిన అట్రాసిటీ చట్టాలను వైసీపీ రాజకీయ ప్రయోజనాలకు వాడుతోందని అన్నారు. యూట్యూబ్ ఛానల్ జర్నలిస్ట్ గంటా నవీన్ ఏమయ్యాడో వసంత సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.


ల్యాంకో హిల్స్ నుంచి కొండపల్లి హిల్స్ వరకూ వసంత కుటుంబ అవినీతి అంతా ఇంతా కాదన్నారు.  తమ అవినీతిని ప్రశ్నిస్తే బెదిరించి జైలు పాల్జేస్తారా? అని ప్రశ్నించారు. తమ తాటాకు చప్పుళ్లకు భయపడేవాళ్లు ఎవరూ లేరన్నారు. మనీలాండరింగ్ కేసుల్లో వసంత కృష్ణ ప్రసాద్ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. మైలవరం నియోజకవర్గంలో సెంటు భూమికి సంబంధించిన 400 ఎకరాల్లో వసంత డబ్బు కొట్టేశారని ఆరోపించారు. తమకు చిత్తశుద్ధి ఉంటే మైనింగ్ అక్రమాలపై ప్రధాని, కేంద్ర అటవీశాఖకు ముఖ్యమంత్రితో లేఖ రాయించాలని అన్నారు. కొండపల్లి బొమ్మలను తయారు చేసే చెట్లను నరికేసి దందాలు, మైనింగ్‌తో కోట్లు కొల్లగొడుతున్నారని పంచుమర్తి అనురాధ తీవ్రస్థాయిలో విమర్శించారు. 

Updated Date - 2021-07-30T19:18:54+05:30 IST