ఎఫ్ఐఆర్ కాపీలను పబ్లిక్ డొమైన్లో ఉంచాలి: Varla ramaiah
ABN , First Publish Date - 2022-06-25T19:50:25+05:30 IST
పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ కాఫీలను పబ్లిక్ డొమైన్లో ఉంచేలా చర్యల తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ రాశారు.
అమరావతి: పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ కాఫీలను పబ్లిక్ డొమైన్లో ఉంచేలా చర్యల తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి టీడీపీ నేత వర్ల రామయ్య(Varla ramaiah) లేఖ రాశారు. చట్టంలో పేర్కొన్న విధంగా ప్రభుత్వం ఎఫ్ఐఆర్ కాపీలను పబ్లిక్ డొమైన్లో ఉంచడం లేదని తెలిపారు. ప్రభుత్వం జిఓలను రహస్యంగా ఉంచిన తరహాలోనే ఎఫ్ఐఆర్లను కూడా దాచిపెడుతోందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అర్ధరాత్రి రహస్య జీవోలతో అపఖ్యాతి పాలైనా బుద్ధి రాలేదని విమర్శించారు. సెక్షన్ 154, 207 సీఆర్పీసీ ప్రకారం నిందితులకు ఎఫ్.ఐ.ఆర్, సంబంధిత పత్రాలను అందుబాటులో ఉంచాలని స్పష్టంగా నిర్దేశిస్తోందని చెప్పారు. అత్యంత సున్నితమైన స్వభావం కలిగి ఉంటే తప్ప అన్ని ఎఫ్.ఐ.ఆర్ లను 24 గంటలలోపు పబ్లిక్ డొమైన్లో ఉంచాలని పేర్కొన్నారు. అపెక్స్ కోర్ట్ ఆఫ్ ఇండియా నిర్దిష్ట ఆదేశాలకు, సూచనలకు కట్టుబడి ఉండటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విముఖంగా ఉన్నట్లు కనిపిస్తోందని వర్ల అన్నారు.
టీడీపీ సీనియర్ నాయకులు చింతకాయల అయ్యన్న పాత్రుడుపై అనేక ఎఫ్ఐఆర్లు నమోదవుతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. కానీ ఎఫ్ఐఆర్ను పోలీసుల పబ్లిక్ డొమైన్లో ఉంచడం లేదని అన్నారు. 41ఎ సీఆర్పీసీ కింద నోటీసులు అందజేసేందుకు ప్రతిరోజూ నర్సీపట్నంలోని అయ్యన్న పాత్రుడు ఇంటికి పోలీసులు వస్తూనే ఉన్నారని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పోలీసులు పాటించి ఉంటే అయ్యన్నకు న్యాయవ్యవస్థను ఆశ్రయించే సౌలభ్యం ఉండేదన్నారు. అపెక్స్ కోర్టు సూచనలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తున్న పోలీసుల చర్యలు కోర్టు ధిక్కారానికి సమానమని చెప్పారు. ఎఫ్ఐఆర్ కాపీలను పబ్లిక్ డొమైన్లో ఉంచేలా పోలీస్ శాఖను సీఎస్ ఆదేశించాలని వర్ల రామయ్య లేఖలో పేర్కొన్నారు.