మహా సంఘీభావం
ABN , First Publish Date - 2022-09-29T06:27:11+05:30 IST
అమరావతి రైతుల మహాపాదయాత్రకు కైకలూరు, నూజివీడు నియోజకవర్గాల రైతులు బ్రహ్మరథం పట్టారు.
పాదయాత్రకు మద్దుతు తెలిపిన రైతులు, టీడీపీ నాయకులు
భారీగా విరాళాలు అందజేత
అమరావతి రైతుల మహాపాదయాత్రకు కైకలూరు, నూజివీడు నియోజకవర్గాల రైతులు బ్రహ్మరథం పట్టారు. బుధవారం పాదయాత్రలో పాల్గొని తమ సంఘీభావం ప్రకటించారు. పలువురు విరాళాలు అందజేసి మద్దతు తెలిపారు. అమరావతి రైతులదే అంతిమ విజయమని అన్నారు.
ముసునూరు, సెప్టెంబరు 28: అమరావతి రైతుల పాదయాత్రకు మద్దతు పెరుగుతోంది. బుధవారం ఏలూరులో కొనసాగుతున్న పాదయాత్రలో మం డల వ్యాప్తంగా వందల సంఖ్యలో రైతులు, టీడీపీ నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు. చెక్కపల్లి గ్రామానికి చెందిన రైతు సంఘం నాయకుడు, కామ్రేడ్ కూచిపూడి లక్ష్మీనారాయణ స్మృత్యర్థం ఆయన మనవడు, టీడీపీ నాయకుడు కూచిపూడి దేవేంద్ర రూ. లక్ష అమరావతి రైతులకు విరాళంగా ఇచ్చి, హిమాలయాల నుంచి తీసుకువచ్చిన జలంతో రైతుల కాళ్లు కడిగారు. అలాగే కాట్రేనిపాడు టీడీపీ కుటుంబ సభ్యులు రూ. లక్షా 17 వేలు రైతులకు అందజేశారు. మూడు రాజధానుల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్న జగన్రెడ్డికి ప్రజలే బుద్ధి చెబుతారని టీడీపీ నాయకులు పేర్కొన్నారు.
ముదినేపల్లి/ముదినేపల్లి రూరల్: అమరావతి రైతుల మహా పాదయాత్రకు సంఘీభావంగా బుధవారం ముదినేపల్లి మండలం నుంచి పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏలూరు తరలివెళ్లారు. టీడీపీ నేత కొడాలి వినోద్ ఆధ్వర్యంలో తెలుగు యువత కైకలూరు నియోజకవర్గ అధ్యక్షుడు దావు నాగరాజు, నాయకులు చొప్పర ఫణి, దాసి ఆంజనేయులు, పరసా ఫణీంద్ర, అరుగుల సుబ్బారావు తదితరులు పాదయాత్రలో పాల్గొన్నా రు. అంబేడ్కర్ చిత్రపటాన్ని చేతపట్టి పాదయాత్రలో పాల్గొన్న కొడాలి వినోద్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా విజయం అమరావతి రైతులదేనని పేర్కొన్నారు.
చాట్రాయి: ఏలూరులో బుధవారం జరిగిన అమరావతి రైతుల మహా పాదయాత్రలో చాట్రాయి మండల టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలిపారు. జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి మందపాటి బసవారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు మరిడి చిట్టిబాబు, విజయ డెయిరీ డైరెక్టర్ బొట్టు రామచంద్రరావు, నియోజకవర్గ తెలుగు రైతు కార్యనిర్వహక కార్యదర్శి మందలపు జగదీష్, అత్తులూరి శ్రీనివాసరావు, చీకటి చెన్నారావు, కందుల కృష్ణ,పానుగళ్ళ కోటేశ్వరావు, పలగాని లక్ష్మీనారాయణ, హనుమంతరావు వివిద గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొని అమరావతి రైతులకు సంఘీభావం తెలిపారు.