ఆంక్షల అమ్మఒడితో.....తల్లులకు అన్యాయం
ABN , First Publish Date - 2022-06-28T05:16:22+05:30 IST
లబ్ధిదారుల కుదింపు చేస్తూ అమ్మఒడిని ఆంక్షల ఒడి చేసి ముఖ్యమంత్రి తల్లులకు అన్యాయం చేస్తున్నారని టీడీపీ నాయకులు మానుకొండ శివప్రసాదు, ఎం ధారునాయక్, సుఖవాసి శ్రీనివాసరావులు మండిపడ్డారు.
ముఖ్యమంత్రిపై టీడీపీ నాయకుల ధ్వజం
గుంటూరు(తూర్పు), జూన్ 27: లబ్ధిదారుల కుదింపు చేస్తూ అమ్మఒడిని ఆంక్షల ఒడి చేసి ముఖ్యమంత్రి తల్లులకు అన్యాయం చేస్తున్నారని టీడీపీ నాయకులు మానుకొండ శివప్రసాదు, ఎం ధారునాయక్, సుఖవాసి శ్రీనివాసరావులు మండిపడ్డారు. గుంటూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా అందరికీ అమ్మఒడి వేస్తానని చెప్పి, ఇప్పుడు మాత్రం ఇంటికి ఒక్కరికి మాత్రమే పథకాన్ని వర్తింప చేయడం దారుణమన్నారు. అమ్మఒడికి పెడుతున్న ఆంక్షలతో రాష్ట్రవ్యాప్తంగా 44 లక్షల మంది తల్లులకు జగన్ నమ్మకద్రోహం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలుత రూ 15 వేలు అని చెప్పి ఆ తరువాత ప్రతి ఎడాది రూ వెయ్యి తగ్గించి ఖాతాల్లో జమచేయడం మడమ తిప్పడం కాదా అని ప్రశ్నించారు. అమ్మఒడికి ఉన్నన్ని ఆంక్షలు బహుశా పాకిస్తాన్కు వెళ్లడానికి కూడా లేవని ఎద్దేవా చేశారు. రూరల్ ప్రాంతంలో రూ 10వేలు, అర్బన్ ప్రాంతంలో రూ 5వేలు ఆదాయం. మాగాణీ 3 ఎకరాలు, మెట్ట 10 ఎకరాలకు మించకూడదు, ఫోర్ వీలర్ ఉండకూడదు, 300 యూనిట్లు విద్యుత్ వినియోగం ఉండకూడదు అంటూ, ఒక్క పఽథకానికి ఇన్ని ఆంఖలా అంటూ మండిపడ్డారు. నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వ అధికారుల పిల్లలకు సైతం అమ్మఒడి వర్తింపచేయడం అన్యాయమన్నారు. ఆంక్షలను ఎత్తివేసి ప్రతి పేద విద్యార్థికి అమ్మఒడి వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కంచర్ల శివరామయ్య, యర్రగోపు నాగేశ్వరరావు, నాయుడు ఓంకార్, కసుకుర్తి హనుమంతురావు తదితరులు పాల్గొన్నారు.