చేనేత రంగానికి జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి: Lokesh

ABN , First Publish Date - 2022-03-05T19:21:22+05:30 IST

చేనేత‌రంగానికి భారంగా మారిన జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వెన‌క్కి తీసుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ డిమాండ్ చేశారు.

చేనేత రంగానికి జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి: Lokesh

అమరావతి: చేనేత‌రంగానికి భారంగా మారిన జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వెన‌క్కి తీసుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌కు లోకేష్ లేఖ రాశారు. జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వచ్చే జీఎస్టీ మండలి భేటీలో వెనక్కి తీసుకోవాలన్నారు.  కరోనా దెబ్బతో పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత పరిశ్రమను తిరిగి గాడిన పెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉదారంగా ఆదుకోవాలని కోరారు. నేత కళాకారులని గుర్తించి సంక్షేమ కార్యక్రమాలు అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వ చిన్నచూపు, కరోనా కారణంగా చేనేత రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. చేనేత రంగానికి అండగా నిలిచిన సంక్షేమ కార్యక్రమాలు, సబ్సీడీలు, తక్కువ వడ్డీకే రుణాలు, ఆప్కో ద్వారా కొనుగోళ్లు, నేతన్నలకు ప్రోత్సాహకాలు లాంటి అనేక కార్యక్రమాలను వైసీపీ ప్రభుత్వం అమలు చెయ్యకపోవడమే చేనేత రంగం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోందని టీడీపీ నేత లేఖలో తెలిపారు.


అసలే ఇబ్బందుల్లో ఉన్న నేతన్నలకు జీఎస్టీ పెంపు శరాఘాతంగా మారిందన్నారు. చేనేత ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీ విధించడమే పెనుభారమైతే ఇప్పుడు ఏకంగా దానిని 12 శాతానికి పెంచాలనుకోవడం  చేనేత రంగానికి మరణశాసనమే అని అన్నారు. జీఎస్టీ పెంపు నిర్ణయంతో చేనేత పరిశ్రమకు తీవ్ర నష్టం వాటిల్లడమే కాకుండా ఆ రంగాన్ని నమ్ముకొని జీవిస్తున్న వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. తమిళనాడు, తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాలు చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ పెంపుని తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లోకేష్ లేఖలో పేర్కొన్నారు. 

Updated Date - 2022-03-05T19:21:22+05:30 IST