ఉద్యోగుల చేతిలో ప్రభుత్వం క్లీన్ బౌల్డ్ అవటం ఖాయం: Anagani
ABN , First Publish Date - 2022-02-04T16:05:39+05:30 IST
వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేయబట్టే కడుపు మండి వాళ్లు రోడ్ల మీదకు వచ్చారని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు.
అమరావతి: వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేయబట్టే కడుపు మండి వాళ్లు రోడ్ల మీదకు వచ్చారని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. పోలీసుల వైఫల్యం వల్లే ధర్నా విజయవంతం అయిందని ప్రభుత్వం చెప్పటం సిగ్గుచేటని మండిపడ్డారు. ‘‘మీ తప్పుల్ని పోలీసులపైకి నెట్టి వాళ్లను బలి చేస్తారా?... కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పని చేసిన పోలీసులకు ఇదేనా మీరేచ్చే గౌరవం ఇదేనా?’’ అని ప్రశ్నించారు. పోలీసులు సంయమనంతో వ్యవహరించారని.. లేకుంటే తీవ్రమైన పరిణామాలు జరిగి ఉండేవని అన్నారు. పోలీసులను అందుకు అభినందిస్తున్నామని... ఇకనైనా పోలీసులు వైసీపీ చట్ట వ్యతిరేక పనులకు సహకరించకుండా చట్టబద్ధంగా నడుచుకోవాలని హితవుపలికారు. ప్రభుత్వం తన తప్పుల్ని తెలుసుకుని ఉద్యోగుల పట్ల వైఖరి మార్చుకోవాలన్నారు. లేకపోతే ఉద్యోగుల చేతిలో ప్రభుత్వం క్లీన్ బౌల్డ్ అవటం ఖాయమని అనగాని హెచ్చరించారు.