టీడీపీతోనే బీసీలకు రాజ్యాధికారం

ABN , First Publish Date - 2022-06-24T05:30:00+05:30 IST

బీసీల రాజ్యాధికారం తెలుగుదేశంతోనే సాధ్యమని వడ్డెర సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్‌ వడ్డే వెంకట్‌ అన్నారు.

టీడీపీతోనే బీసీలకు రాజ్యాధికారం
ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేస్తున్న వడ్డెర సంఘం నేతలు

వడ్డెర సాధికార సమితి కన్వీనర్‌ వెంకట్‌

గుంటూరు, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): బీసీల రాజ్యాధికారం తెలుగుదేశంతోనే సాధ్యమని  వడ్డెర సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్‌ వడ్డే వెంకట్‌ అన్నారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన అధ్యక్షతన సాధికార సమితి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా దివంగత ఎన్టీఆర్‌, వడ్డెర సంఘం సీనియర్‌ నేత చంద్రగిరి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళలు అర్పించారు. సమావేశంలో వెంకట్‌ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి వడ్డెరలు వెన్నెముకలాంటి వారని తెలిపారు. పార్టీ ఆవిర్భావం నుంచి రాష్ట్రంలోని వడ్డెరలు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. వైసీపీ ప్రభుత్వం బీసీలకు 56 కార్పొరేషన్లు పెట్టామని, పదవులిచ్చామని చెప్పినా ఒక్క రూపాయి కూడా ఆ కార్పొరేషన్లకు నిధులు కేటాయించలేదని విమర్శించారు. వడ్డెర్లకు 45 ఏళ్లకే పింఛను సౌకర్యం, వడ్డెర్ల ఎస్టీ జాబితా అంశం, ప్రమాద బీమా, చట్టసభల్లో ప్రాధాన్యం వంటి అంశాలు పార్టీ మ్యానిఫెస్టోలో చేర్చేలా చంద్రబాబు దృష్టికి తీసుకువెళతామన్నారు. కార్యక్రమంలో వడ్డెర సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లె ఈశ్వర్‌, బీసీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తిరుపాల్‌ బాబు ప్రసంగించారు. నేతలు విజయ, ముసలయ్య, మల్లికార్జునరావు, జాన్‌ సైదా, పుల్లారావు, బాలకిశోర్‌ తదితరులు పాల్గొన్నారు.   


Updated Date - 2022-06-24T05:30:00+05:30 IST