జగన్ విశ్వసనీయతపై చర్చకు సిద్ధమా?
ABN , First Publish Date - 2022-08-10T06:09:33+05:30 IST
జగన్ విశ్వసనీయత, విలువలు గురించి బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు అన్నారు.
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు
గుంటూరు (సంగడిగుంట), ఆగస్టు 9: జగన్ విశ్వసనీయత, విలువలు గురించి బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు అన్నారు. టీడీపీ పశ్చిమ కార్యాల యంలో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ తన తండ్రి మరణం వెనుక అంబానీ సోదరుల హస్తం ఉన్నదని ఎన్నికల్లో ఊదరగొట్టి లబ్ధి పొందిన జగన్ అధికారంలోకి రాగానే వారికి రెడ్కార్పెట్ పరిచి వారు చెప్పిన వ్యక్తికి రాజ్యసభ సభ్యత్వం కట్టబెట్టిన ఆయన విలువలు, విశ్వసనీయత గురించి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. తల్లికి, చెల్లికి న్యాయం చేయని జగన్ సచ్చీలత గురించి సజ్జల కాకమ్మ కబుర్లు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తన బాబాయిని చంద్రబాబు, లోకేశ్ కలసి హత్య చేయించారని ఆస్కార్ లెవల్లో నటించి మెప్పించిన జగన్, అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చేటప్పటికి కేంద్ర హోంమంత్రి అమిత్షాతో కాళ్లబేరాలకు దిగుతున్నదెవరో సజ్జల సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో సీబీఐ ఈడీల నుంచి ఒక్క నోటీసు కూడా అందుకోలేదని అన్నారు. ఎన్డీఏ కన్వీనర్ హోదాలో ప్రధానమంత్రులు, రాష్ట్రపతులను నిర్ణయించిన చంద్రబాబుకు వారిని కలవటం అనేది సర్వసాదారణమైన విషయమని, దానికి వైసీపీ నాయకులు ఎందుకంత భయపడుతున్నారని ప్రశ్నించారు. కుప్పంలో వైసీపీ అభ్యర్థి భరత్ను గెలిపిస్తే మంత్రిని చేస్తానన్న జగన్ మాటలను విని ఆ పార్టీ నాయకులే నవ్వుకుంటున్నారని, మర్రి రాజశేఖర్ను మంత్రిని చేసినట్లే ఉంటుందని ఎద్దేవా చేశారు. ఏమాత్రం నైతిక విలువలున్నా, వెంటనే ఎంపీ మాధవ్, మంత్రి అంబటి, ఎమ్మెల్యే అవంతిలను పార్టీ నుంచి బహిష్కరించాలని కనపర్తి డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు ఈరంటి వరప్రసాదు, కొమ్మినేని కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.