జంగారెడ్డి గూడెం ఘటనపై టీడీపీ నేతల ప్రెస్ మీట్

ABN , First Publish Date - 2022-03-14T18:26:53+05:30 IST

జంగారెడ్డి గూడెం ఘటనపై టీడీపీ నేతలు మీడియా సమావేశంలో మాట్లాడుతూ...

జంగారెడ్డి గూడెం ఘటనపై టీడీపీ నేతల ప్రెస్ మీట్

అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా, జంగారెడ్డి గూడెంలో జరిగిన వరుస మరణాలపై అసెంబ్లీ, శాసనమండలిలో రగడ నెలకొంది. టీడీపీ నేతలు ఇచ్చిన వాయిదా తీర్మానాల నేపథ్యంలో సభ ఆర్డర్‌లో లేకపోవడంతో అసెంబ్లీ స్పీకర్, మండలి ఛైర్మన్ ఉభయ సభలను వాయిదా వేశారు. జంగారెడ్డి గూడెం ఘటనపై టీడీపీ నేతలు మీడియా సమావేశంలో మాట్లాడుతూ... కల్తీసారాపై చర్చకు వైసీపీ భయపడుతోందని చినరాజప్ప విమర్శించారు. కల్తీసారా మరణాలపై వాయిదా తీర్మానాన్ని సభాపతి తిరస్కరించారని మండిపడ్డారు. సభలో చర్చించేందుకు అవకాశం ఇవ్వకుండా సభను వాయిదా వేస్తున్నారని దుయ్యబట్టారు. కల్తీసారా మరణాలపై చర్చ కోసమే.. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం దగ్గర ఆందోళన చేశారని చినరాజప్ప అన్నారు. 


బొచ్చల అర్జునుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలో విచిత్రమైన, చేతగాని ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. ఎన్నికల హామీలపై ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వరని, మద్యపానంపై రేట్లు పెంచితే తాగేవాళ్లు తక్కువ తాగుతారని, దానివల్ల మద్యపానం నెమ్మదిగా నిషేధమవుతుందని ప్రభుత్వం దుర్మార్గపు ఆలోచనవల్ల రాష్ట్రంలో నాటుసారా విపరీతంగా పెరిగిందని ఆరోపించారు. జంగారెడ్డి గూడెం ఘటనపై సభలో ప్రశ్నిస్తే సీఎం జగన్ మాట్లాడరని మండిపడ్డారు. సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం ప్రభుత్వానికి లేదని విమర్శించారు. మద్యాన్ని అడ్డంపెట్టుకుని వ్యాపారం చేసి పరిపాలన చేస్తున్నారని, ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని బొచ్చల అర్జునుడు మండిపడ్డారు.

Updated Date - 2022-03-14T18:26:53+05:30 IST