TDP protest: లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ శాసనసభా పక్షం నిరసన
ABN , First Publish Date - 2022-09-20T16:34:58+05:30 IST
నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ శాసనసభా పక్షం తుళ్లూరు ట్రాఫిక్ పీఎస్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టింది.
అమరావతి (Amaravathi): తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం టీడీపీ శాసనసభా పక్షం తుళ్లూరు ట్రాఫిక్ పీఎస్ దగ్గర నిరసన (Protest) కార్యక్రమం చేపట్టింది. 'సంక్షోభంలో సంక్షేమం' నినాదంతో ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు నేతలు పాల్గొన్నారు. అన్న క్యాంటీన్లు, పెళ్లి కానుక, పండుగ కానుకలు, అంబేద్కర్ విదేశీ విద్య పథకాల రద్దు, వైసీపీ సర్కార్ సంక్షేమాన్ని గాలికొదిలేసిందంటూ నేతలు నిరసన తెలిపారు. మూడున్నరేళ్లుగా ప్రభుత్వం ప్రజలను దగా చేస్తోందని ఆరోపించారు.
సబ్ప్లాన్ నిధులు పక్కదారి, అమ్మ ఒడి కుదింపు, డ్వాక్రాకి టోకరా, కరెంటు బిల్లుల ఆధారంగా ఫించన్ కోత.. తదితర అంశాలపై టీడీపీ నేతలు ఆందోళన చేశారు. రేషన్ బియ్యం కుంభకోణం.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు నయవంచన నినాదాలతో నిరసన తెలుపుతూ కాలి నడకన అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీకి వచ్చే అన్ని మార్గాల్లోనూ పోలీసులు గట్టి నిఘా పెట్టారు.