ఎమ్మెల్యే వ్యాఖ్యలపై టీడీపీ నిరసనలు
ABN , First Publish Date - 2022-06-28T05:41:54+05:30 IST
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నాయకులు సోమవారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
ఫాల్గుణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
అరకులోయ, జూన్ 27: టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నాయకులు సోమవారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహం వద్ద జరిగిన కార్యక్రమంలో పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సివేరి దొన్నుదొర మాట్లాడుతూ, ఎమ్మెల్యే హోదాలో ఉన్న వ్యక్తి ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడడం తగదన్నారు. అనుచితంగా మాట్లాడిన ఎమ్మెల్యేపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకుల అరాచకాలు పెరిగిపోతున్నాయని, త్వరలోనే వారికి ప్రజలు బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పెదలబుడు సర్పంచ్ పెట్టెలి దాసుబాబు, నాయకులు లకోయ్ మహదేవ్, కళావతి, ద్రౌపతి, సుబ్బారావు, చందు తదితరులు పాల్గొన్నారు.
ముంచంగిపుట్టులో...
ముంచంగిపుట్టు: ఎమ్మెల్యే ఫాల్గుణపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టీడీపీ మండల నాయకులు సోమవారం ఆందోళన కార్యక్రమం చేపట్టారు. మండల కేంద్రంలోని నాలుగు రోడ్ల కూడలిపై రాస్తారోకో, ధర్నా చేశారు. అక్కడ నుంచి స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి చంద్రబాబుపై నోరుపారేసుకున్న ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ బాధ్యత గల ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రిని తిట్టండి, కొట్టండి, చంపండి అంటూ ప్రజలను రెచ్చగొట్టడం దారుణమన్నారు. తక్షణమే ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు వి.లక్ష్మణ్, బాబూజీ, గంగాధర్, చిన్నిబాబు, నీలకంఠంపాత్రో, భగత్రామ్, చిరంజీవి, వంతాల చిన్నా, లోకేష్ పాల్గొన్నారు.