తెలుగుజాతి ఖ్యాతిని చాటిన ఎన్టీఆర్
ABN , First Publish Date - 2022-06-29T06:03:56+05:30 IST
ప్రపంచవ్యాప్తంగా తెలుగువారికి గుర్తింపు తెచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు అని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి కొనియాడారు.
సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి
గుంటూరు, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): ప్రపంచవ్యాప్తంగా తెలుగువారికి గుర్తింపు తెచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు అని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి కొనియాడారు. పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్కుమార్ అధ్యక్షతన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగుదేశానికి జీవం పోసి దేశ రాజకీయాల స్వరూపాన్నే మార్చేశారన్నారు. రాజకీయ పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని ఆయన కొనియాడారు. రాజకీయంగా ఏ అనుభవం లేకపోయినా ప్రజల కోసం చారిత్రక నిర్ణయాలు తీసుకున్నారన్నారు. సమాజమే దేవాలయం- ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో ప్రజా సంక్షేమ పాలనకు బాటలు వేసి భారత రాజకీయ చరిత్రలో సంక్షేమ అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. తలలు పండిన రాజకీయ నాయకులకు దీటుగా ఆయన నిర్ణయాలు ఉండేవని ప్రశంసించారు. పురుషులతో మహిళలు కూడా సమానమని భావించి వారికి ఆస్తిలో సమాన హక్కు కల్పించి స్త్రీ, పురుష నిరూపించిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని తెలిపారు. తెలుగువాడి ఆత్మగౌరవం కోసం అనునిత్యం పాటుబడిన మహోన్నత వ్యక్తిని స్మరించుకోవడం తెలుగువారి అదృష్టమన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు నక్కా ఆనంద్బాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని చెప్పుకున్నట్లే తెలుగుదేశం పార్టీకి ముందు, పార్టీకి తరువాత అని చెప్పుకునేలా రాజకీయాల్లో విప్లవాత్మక మార్పు తెచ్చిన ఘనత ఎన్టీఆర్కు దక్కుతుందని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా పార్టీ సీనియర్ నాయకుడు మాకినేని పెదరత్తయ్య, ఎన్టీఆర్ వీరాభిమాని కావూరి సత్యనారాయణ, పార్టీ నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ను సన్మానించారు. కార్యక్రమంలో పిల్లి మాణిక్యరావు, దామచర్ల శ్రీనివాసరావు, కాట్రగడ్డ రామకృష్ణ, మద్దిరాల ఇమ్యానుయేలు, మన్నవ మోహన్కృష్ణ, కంచర్ల శివరామయ్య, ఓంకార్, బుచ్చిరాంప్రసాద్ పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు.