అందుకే ఆత్మకూరులో పోటీ చేయలేదు
ABN , First Publish Date - 2022-06-14T08:09:57+05:30 IST
తెలుగుదేశం పార్టీ ఎంతో కాలం నుంచి పాటిస్తున్న సంప్రదాయాల్లో భాగంగానే నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికలో పోటీ చేయలేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు
వైసీపీకి ఏదైనా విధానం ఉంటే చెప్పాలి: అచ్చెన్న
తెలుగుదేశం పార్టీ ఎంతో కాలం నుంచి పాటిస్తున్న సంప్రదాయాల్లో భాగంగానే నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికలో పోటీ చేయలేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, ఆయన నీలిమూక ఈ ఎన్నికలో దిక్కుమాలిన సవాళ్లు మాని ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన సూచించారు. ‘ఎమ్మెల్యేలు, ఎంపీలు మరణించిన తర్వాత జరిగే ఉపఎన్నికలో వారి కుటుంబ సభ్యులు బరిలో ఉంటే పోటీ పెట్టకూడదనే సంప్రదాయాన్ని టీడీపీ ఎప్పటి నుంచో పాటిస్తోంది. గతేడాది తిరుపతి లోక్సభ స్థానం ఉప ఎన్నిక వచ్చింది.
చనిపోయిన ఎంపీ కుటుంబ సభ్యులకు కాకుండా వేరేవారికి సీటు ఇవ్వడం వల్ల టీడీపీ అక్కడ పోటీ చేసింది. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం వల్ల వచ్చిన ఆత్మకూరు ఉపఎన్నికలో ఆయన కుటుంబ సభ్యులే పోటీ చేస్తున్నందువల్ల ఆ ఎన్నికకు టీడీపీకి దూరంగా ఉంది’ అని ఆయన వివరించారు. ఆత్మకూరు ఉపఎన్నికలో టీడీపీ ఎందుకు పోటీ చేయడం లేదని చెత్త సవాళ్లు విసురుతున్న జగన్ రెడ్డి ముఠాకు చేతనైతే ఈ విషయంలో తమ పార్టీ విధానం ఏమిటో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.