తేల్చుకుందాం.. రండి!
ABN , First Publish Date - 2022-01-24T05:39:47+05:30 IST
టీడీపీ, వైసీపీ నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లతో అమరావతిలో ఆదివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది.
సోషల్మీడియా వేదికగా టీడీపీ, వైసీపీ నేతల సవాళ్లు
క్వారీ వద్దకు బయలుదేరిన పార్టీల నాయకులు
టీడీపీ నేతలపై లాఠీచార్జి, అరెస్టు
అమరావతిలో ఉద్రిక్తత
అమరావతి, జనవరి23: టీడీపీ, వైసీపీ నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లతో అమరావతిలో ఆదివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇరుపార్టీల నాయకులు గత మూడు రోజుల నుంచి సోషల్మీడియా వేదికగా ఎమ్మెల్యే శంకరరావు, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి తదితర అంశాలపై సవాళ్లు విసురుకున్నారు. ఇరుపార్టీల నాయకులు లేమల్లెలో గత ప్రభుత్వం హయాంలో జరిగిన గ్రావెల్ క్వారీయింగ్ ప్రదేశాన్ని వేదికగా చేసుకుని చర్చించేందుకు సోషల్మీడియా ద్వారా నిర్ణయించుకున్నారు. ఆదివారం ఉదయం సమాచారం తెలుసుకున్న పోలీసులు టీడీపీ, వైసీపీ నాయకులను ముందుగా హౌస్అరెస్టు చేశారు. అయినప్పటికీ లేమల్లె వెళ్లేందుకు నాయకులు తమ అనుచరులతో బయలుదేరుతుండగా పెదమద్దూరు రోడ్డుసెంటర్లో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు లాఠీచార్జి చేసి టీడీపీ నాయకులను స్టేషన్కు తీసుకువెళ్లి మధ్యాహ్నం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. వైసీపీకి చెందిన దండా నాగేంద్ర, ఆళ్ల శ్రీనివాసరెడ్డి, నాయుడు రాంబాబు లేమల్లె క్వారీ వద్దకు వెళ్లి గత ప్రభుత్వంలో టీడీపీ నాయకులు అవినీతి చేశారని ఆరోపణలు చేశారు. సవాలు చేసిన టీడీపీ నాయకులు రాలేదని ఎద్దేవా చేశారు. పోలీసులు చేసిన లాఠీచార్జిలో తెలుగుదేశం నాయకులకు గాయాలయ్యాయి. వైసీపీ నుంచి ఎంపీపీ ఎం.హనుమంతరావు సవాళ్లు చేయగా టీడీపీ నుంచి మండల పార్టీ అధ్యక్షుడు మల్లాది విష్ణు, షేక్ జానీ తదితరులు సోషల్ మీడియాలో ప్రతిసవాళ్లు చేశారు. హనుమంతరావును పెదమద్దూరు సెంటర్ నుంచి ఇంటికి పంపించారు. సాయంత్రం టీడీపీ నాయకులు కూడా ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి పోలీసులను అడ్డుపెట్టుకుని వైసీపీ నాయకులు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.