టీ కట్టు..మద్యం కొట్టు

ABN , First Publish Date - 2020-07-06T10:14:24+05:30 IST

టీ దుకాణాల వద్ద జనం గుమికూడుతుండడంతో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది

టీ కట్టు..మద్యం కొట్టు

కరోనా నియంత్రణకు టీ అంగళ్లు మూత

బార్లా తెరిచిన మద్యం దుకాణాలు

ఇక్కడ క్యూలో ఉంటే వైరస్‌ సోకదా..?

ఉపాధి కోల్పోతున్న చిరు వ్యాపారులు


కడప (సిటీ), జూలై 5: టీ దుకాణాల వద్ద జనం గుమికూడుతుండడంతో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది.. అందువల్ల దుకాణాలు మూసివేయాలని పోలీసు అధికారులు ఆదేశించారు. దీంతో కడప నగరంలోని టీ దుకాణాలన్నీ మూతబడ్డాయి. తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 7 గంటల దాకా నిలబడి టీ అమ్ముకుంటూ వచ్చే అరకొర సంపాదనతో జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారులు వారు. లాక్‌డౌన్‌తో దాదాపు మూడు నెలలు పూర్తిగా టీ దుకాణాలు మూసివేశారు. సడలింపుల్లో భాగంగా కొన్ని రోజుల నుంచి అఽధికారులు అనుమతించిన సమయంలో మాత్రమే వ్యాపారం చేసుకుంటున్నారు.


కరోనా కేసులు పెరుగుతున్నాయని తిరిగి వీటిని బంద్‌ చేయించారు. సందు గొందుల్లో ఉన్న చిన్న చిన్న టీ దుకాణాలు సైతం మూతబడ్డాయి. టీ దుకాణాల బంద్‌తో యజమానులకే దిక్కులేకుండా పోయింది. వారి వద్ద పనిచేసేవారు మరింత నిస్సహాయులుగా మిగిలారు. టీ దుకాణాల వద్ద జనాన్ని గుంపులుగా ఉండనీయవద్దని ఆదేశిస్తే ఆచరించే వీరిపై మూత పేరుతో రోడ్డుపాలు చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీనిపై డీఎస్పీ సూర్యనారాయణ మాట్లాడుతూ కడపలో కరోనా వ్యాప్తి చెందుతుండడంతో ముందస్తు చర్యల్లో భాగంగా టీ దుకాణాలను మూయించి వేశామన్నారు. ఎన్నిసార్లు చెప్పినా జనం గుంపులుగా చేరుతున్నారని, విధిలేని పరిస్థితుల్లోనే దుకాణాలను మూయించామని ఈ నెలాఖరు వరకు ఇలాగే కొనసాగిస్తామని తెలిపారు.


మద్యం దుకాణాలో..

ఇదిలా ఉంటే వైన్‌ షాపుల వద్ద మాత్రం మద్యం ప్రియులు బారులు తీరుతున్నారు. అక్కడక్కడా మాస్కులు కనిపిస్తున్నా భౌతిక దూరం ఏ మాత్రం ఉండడం లేదు. మరి అక్కడికి చేరే వారి వల్ల వైరస్‌ వ్యాప్తి చెందదా అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. టీ కొట్టు వద్దు.. మద్యం దుకాణాలు ముద్దు అన్న చందంగా పరిస్థితి మారింది. అయితే.. దుకాణాల వద్ద ప్లాస్కుల్లో నింపుకుని టీ విక్రయిస్తామని, ఎవరినీ నిలబడనివ్వమని, అనుమతిస్తే అధికారుల సూచనల మేర వ్యాపారం చేసుకుంటామని కొందరు టీ దుకాణాల నిర్వాహకులు అంటున్నారు.

Updated Date - 2020-07-06T10:14:24+05:30 IST