Video viral: విద్యార్థిని చితకబాదిన మాస్టారు
ABN , First Publish Date - 2021-10-16T00:34:01+05:30 IST
తల్లి, తండ్రి, గురువు, దైవం.. అంటారు పెద్దలు. తల్లి, తండ్రి తరువాత దేవుడికంటే గురువుకే ప్రాధాన్యం ఉంటుంది. అంతటి విలువైన ..
చెన్నై: తల్లి, తండ్రి, గురువు, దైవం.. అంటారు పెద్దలు. తల్లి, తండ్రి తరువాత దేవుడికంటే గురువుకే ప్రాధాన్యం ఉంటుంది. అంతటి విలువైన గురువు స్థానానికే కొందరు గురువులు మచ్చ తెచ్చే పనులు చేస్తుంటారు. తమిళనాడులోని ఓ ఉన్నత పాఠశాలలో అలాంటి ఓ గురువు కెమెరా కంటికి చిక్కాడు. ఓ విద్యార్థిని జుట్టుపట్టుకుని కింద పడేసి బెత్తంతో ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. విచక్షణారహితంగా కాళ్లతో తన్నాడు. ఈ వీడియోను తోటి విద్యార్థి ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది విపరీతంగా వైరల్ అయింది.
ఈ వీడియోను కాంగ్రెస్ నేత ఎం చిదంబర్ తనయుడు కార్తీ చిదంబరం తన ట్విటర్లో షేర్ చేశారు. విద్యార్థులను ఇలా హింసించే అధికారం ఏ ఉపాధ్యాయుడికీ లేదని, ఈ టీచర్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన తన ట్వీట్లో విద్యాశాఖను కోరారు.
కాగా.. చిదంబరం జిల్లాలోని దురై కలియమూర్తి నగర్ ప్రాంతంలో ఉన్న నందనార్ బాలుర పాఠశాలలో ఈ ఘటన జరిగింది. విద్యార్థిని కొడుతున్న టీచర్ పేరు సుబ్రహ్మణ్యంగా గుర్తించారు. పాఠశాలకు సరిగా హాజరు కావడం లేదనే కోపంతో ఏడుగురు 12వ తరగతి ఫిజిక్స్ విద్యార్థులను టీచర్ ఇష్టం వచ్చినట్లు కొట్టాడు.
ఈ ఘటనపై పాఠశాల ఇంచార్జ్, కేర్టేకర్ సెల్వ పాండ్యన్ విచారణకు ఆదేశించారు. విచారణఅనంతరం సుబ్రహ్మణ్యంపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.